అక్షరటుడే, అమరావతి: Space : అంతరిక్షయానం అంటే అదో సువర్ణావకాశం. అందరికీ అది సాధ్యమయ్యే పనికాదు..! అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోంది మన తెలుగమ్మాయి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి(23) (Dhungeti Jahnavi) అంతరిక్షంలో అడుగుపెట్టే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.
జాహ్నవి అంతరిక్షయానం ఎంపికతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ యువతిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ర్టీస్ (టీఎస్ఐ) చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థి (ఏఎస్సీఏఎన్)గా జాహ్నవి ఎంపిక కావడం గమనార్హం.
ఇప్పటివరకు భారత్లో పుట్టి, ఇక్కడే నివసిస్తున్న యువతి.. నేరుగా అంతరిక్ష యానానికి ఎంపిక అయిన సందర్భం లేదు. టైటాన్ స్పేస్ పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ జాహ్నవి పూర్తిచేసుకుని ఈ స్పేస్ మిషన్కు అర్హత సాధించింది. కాగా, టైటాన్ స్పేస్ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న యువతిని ఏపీ మంత్రి నారా లోకేశ్ అభినందించారు.