అక్షరటుడే, వెబ్డెస్క్: Gadwal | రైతులకు బేడీలు వేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు పోలీసులపై చర్యలు చేపట్టింది.
గద్వాల (Gadwal) జిల్లా పెద్ద ధన్వాడ (Pedda Dhanwada)లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ (Ethanol factory)కి వ్యతిరేకంగా రైతులు కొద్ది రోజుల క్రితం నిరసన తెలిపిన విషయం తెలిసిందే. కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు పనులు చేయడానికి వచ్చిన కూలీలను రైతులు తరిమి కొట్టారు. దీంతో పలువురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనలో కేసు నమోదైన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో మహబూబ్నగర్ (Mahabubnagar) జైలుకు తరలించారు.
బుధవారంతో రైతుల రిమాండ్ ముగియడంతో రాజోలి పోలీసులు (Rajoli Police) వారిని కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈ సమయంలో రైతుల చేతులకు సంకెళ్లు వేశారు. అన్నదాతలకు బేడీలు వేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యులైన రాజోలి ఎస్సై రాజేశ్కుమార్, ఏఎస్సైలు రామకృష్ణ, శ్రీనివాస్ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ తొట్టి శ్రీనివాస్ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.