అక్షరటుడే, కామారెడ్డి: Fertilizer stores | పట్టణంలో బుధవారం ఫర్టిలైజర్స్ దుకాణాల మూసివేత తీవ్ర చర్చకు దారి తీసింది. ఖరీఫ్ సీజన్ కావడంతో విత్తనాల కోసం రైతులు ఉదయమే కామారెడ్డికి (Kamareddy) రాగా ఫర్టిలైజర్ షాపులు మూసి ఉండడంతో ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విత్తన దుకాణాలు మూసివేశారు. మంగళవారం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ (Food Safety Department), విజిలెన్స్ అధికారులు (Vigilance Department) తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.
దీంతో బుధవారం ఫర్టిలైజర్ షాపులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయనున్నారని సమాచారం అందడంతో ఉదయం నుంచి షాపులన్నీ మూసివేశారు. రైతులు వందలాదిగా విత్తనాల కోసం వచ్చి వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు రైతులు సాయంత్రం 4 గంటల వరకు దుకాణాల వద్దే వేచి చూశారు. ఎన్నడూ లేనిది దుకాణాలు మూసివేయడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.
Fertilizer stores | నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయా..?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా నకిలీ విత్తనాలు ఏమైనా విక్రయాలు జరుపుతున్నారా.. లేక కాలంచెల్లిన విత్తనాలు విక్రయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు తనిఖీలు చేసినా తప్పు చేయనప్పుడు దుకాణాలు ఎందుకు మూసివేశారనే ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. ఎట్టకేలకు సాయంత్రం షాపులు ఓపెన్ కావడంతో రైతులు ఎరువులు కొనుగోలు చేశారు. ఈ విషయమై వ్యవసాయ అధికారులను వివరణ కోరగా విత్తన దుకాణాలు మూసివేసిన విషయం తమకు తెలియదన్నారు.