అక్షరటుడే, వెబ్డెస్క్: Farooq abdullah | మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా బుధవారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చేసిన “గయాబ్”ను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఇలా రాజకీయం చేయడం తగదని, ప్రధానమంత్రిని ప్రశ్నించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. 26 మంది పౌరులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధానమంత్రి కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మోదీని ఉద్దేశించి మంగళవారం తన ఎక్స్ హ్యాండిల్లో “గయాబ్” అని ఓ ఫొటో పెట్టింది. నేరుగా మోదీ ఫొటో, పేరు లేకపోయినప్పటికీ, ఆ ఆహార్యాన్ని బట్టి ప్రధానిని ఉద్దేశించే పెట్టింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ ఆ పోస్టును డిలీట్ చేసింది. ఈ వివాదంపై అబ్దుల్లా తాజాగా స్పందించారు.
Farooq abdullah | మిత్రపక్షంపై విమర్శలు
జమ్మూకాశ్మీర్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న అబ్దుల్లా.. ఆ పార్టీ తీరుపై మండిపడ్డారు. మోదీపై కాంగ్రెస్ చేసిన విమర్శలను ఖండిస్తూ ప్రధానమంత్రి ఢిల్లీలోనే ఉన్నారని, ఈ పరీక్షా సమయాల్లో ఆయన “తప్పిపోయిన” ప్రశ్నే లేదన్నారు. “ఆయన ఎక్కడ తప్పిపోయాడు? ఆయన ఢిల్లీలో ఉన్నారని నాకు తెలుసు” అని అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ కీలక సమయంలో ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలోనైనా తమ పార్టీ ప్రధానమంత్రికి పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. “మేము ప్రధానమంత్రికి మా పూర్తి మద్దతు ఇచ్చాము. ఆ తర్వాత, మమ్మల్ని ప్రశ్నించకూడదు. ప్రధానమంత్రి తనకు అవసరమైన ఏ పని అయినా చేయాలి” అని అన్నారు.
Farooq abdullah | పాక్పై మా వైఖరి మారింది..
పాకిస్తాన్ పట్ల తరచుగా మెతక వైఖరి అవలంబిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్లా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటిదాకా తాను పాకిస్తాన్తో సంభాషణకు అనుకూలంగా ఉండేవాడినని, కానీ పొరుగు దేశం కాశ్మీర్లోని పహల్గామ్లో మానవత్వాన్ని హత్య చేసిందని అన్నారు. “నేను ప్రతిసారీ పాకిస్తాన్తో చర్చలకు అనుకూలంగా ఉండేవాడిని.. కానీ ఆప్తులను వారిని కోల్పోయిన వారికి మనం ఏం సమాధానం చెబుతాము? మనం న్యాయం చేస్తున్నామా? బాలాకోట్ కాదు, నేడు ఈ రకమైన దాడులు ఎప్పుడూ జరగకుండా అలాంటి చర్య తీసుకోవాలని దేశం కోరుకుంటోంది” అని ఆయన అన్నారు.