అక్షరటుడే, వెబ్డెస్క్ : Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాడు లేనివిధంగా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా (Rythu Bharosa)ను వేగంగా రైతుల (Farmers) ఖాతాల్లో జమ చేసింది.
ఇప్పటివరకు రూ.9 వేల కోట్లను తొమ్మిది రోజుల్లో అన్నదాతలకు అందజేసింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరు రైతులకు పెట్టుబడి సాయం అందించింది. అయితే రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని పలువురు రైతులకు మాత్రం మొండిచేయ్యి చూపింది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రైతుభరోసా జమ చేయాలని కోరుతున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ (BRS) ఆందోళనకు సిద్ధం అవుతోంది.
రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల గల మండలాలకు ప్రభుత్వం రైతు భరోసా జమ చేయలేదు. బాలాపూర్, అబ్దుల్లాపూర్, రాజేందర్నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హయత్నగర్తో పాటుగా మరి కొన్ని మండలాల్లోని రైతులకు ప్రభుత్వం రైతు భరోసా రద్దు చేసింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.
Rythu Bharosa | కూరగాయల సాగు
ఓఆర్ఆర్ లోపల గల మండలాల రైతులు ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తారు. అయితే తమకు రైతు భరోసా జమ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల సాగు వ్యవసాయం కిందకు రాదా? అని ప్రశ్నిస్తున్నారు. తమకు పెట్టుబడి ఉండదా అంటున్నారు. రైతు భరోసా జమ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
Rythu Bharosa | రేపటిలోగా జమ చేయాలి
ఓఆర్ఆర్ లోపల గల రైతులకు బుధవారం సాయంత్రంలోగా రైతు భరోసా జమ చేయాలని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్రెడ్డి (Patlolla Karthik Reddy ) డిమాండ్ చేశారు. లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా రాష్టానికి ఆర్థిక వెన్నెముక అన్నారు. జిల్లా రైతుల ఎన్నో త్యాగాల చేయటంతో రాష్టానికి ఆర్థిక వనరులు సమకూరాయని ఆయన పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు.
Rythu Bharosa | మంత్రి కీలక ప్రకటన
ఔటర్ రింగ్ రోడ్డు లోపల సాగు చేయని భూములు అధికంగా ఉండటతో రైతు భరోసా నిలిపి వేసినట్లు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageshwara rao) తెలిపారు. ఔటర్ లోపల ఉన్న 2.13 లక్షల ఎకరాల భూముల్లో 93 వేల ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనువైనవి కాని భూములుగా గుర్తించామన్నారు. పంటలు సాగు చేస్తున్న 1.20 లక్షల ఎకరాలకు రెండు మూడు రోజుల్లో రైతు భరోసా జమ చేస్తామని ఆయన తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని విమర్శించారు.