అక్షరటుడే, వెబ్డెస్క్: Maharashtra | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్న రాజ్ ఠాక్రే(Raj Thackeray), ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) ఒకే వేదికపై కలిశారు. బాల్ఠాక్రే సోదరుడి కుమారుడైన రాజ్ ఠాక్రే గతంలో శివసేనలో కీలకంగా ఉండేవారు. అయితే బాల్ఠాక్రే(Bal Thackeray) తన కుమారుడైన ఉద్దవ్ ఠాక్రేకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో శివసేన నుంచి 2005లో బయటకు వచ్చిన ఆయన సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ్సేన (MNS) అనే పార్టీని స్థాపించారు. అప్పుడు విడిపోయిన రాజ్ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత మళ్లీ శనివారం కలుసుకోవడం గమనార్హం.
మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) ఇటీవల రాష్ట్రంలో త్రిభాష విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. హిందీని తప్పనిసరిగా చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎంఎన్ఎస్ అధినేత రాజ్ఠాక్రేతో పాటు శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, మహా వికాస్ అఘాడీ నేతలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో ఠాక్రే సోదరులు ఇది తమ విజయంగా పేర్కొంటు శనివారం వాయిస్ ఆఫ్ మరాఠీ(Voice of Marathi) కార్యక్రమం నిర్వహించారు.
Maharashtra | ఆయన చేయలేకపోయారు..
సమావేశంలో రాజ్ఠాక్రే మాట్లాడుతూ.. తమ పెద్ద నాన్న బాల్ ఠాక్రే చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) చేశారన్నారు. తమ ఇద్దరు సోదరులనున కలపాలని బాల్ఠాక్రే ఎన్నో ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. అయినా తాము 20 ఏళ్లుగా కలవలేదన్నారు. అయితే తాజాగా ఫడ్నవీస్ తమను కలిపారని సెటైర్లు వేశారు. రెండు దశాబ్దాల తర్వాత సోదరులు కలుసుకోవడం మహా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
Maharashtra | రాజ్ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ఇటీవల మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడని వారిపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై రాజ్ఠాక్రే స్పందించారు. మరాఠీ మాట్లాడని వారిపై దాడులు సరికాదన్నారు. అలాగే తమ భాషను అవమానిస్తే బుద్ధి చెప్పాలని ఎంఎన్ఎస్ కార్యకర్తలకు సూచించారు. అంతేగాకుండా ‘‘మీరు ఏం చేసినా వీడియోలు రికార్డు చేయొద్దు.. కెమెరాల కంట పడకుండా ఉండాల’’ని ఆయన సూచించడం గమనార్హం. మరోవైపు మరాఠీ అంశంపై రాజ్ ఠాక్రేను ప్రశ్నించినందుకు ఎంఎన్ఎస్ కార్యకర్తలు సుశీల్ కేడియా కార్యాలయం (Sushil Kedia Office)పై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. తమకు హిందీపై ద్వేషం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే బలవంతంగా ఆ భాషను తమపై రుద్దితే ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్ర, మరాఠీ ప్రజల ప్రయోజనాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. తాము కలిసి ఉండటానికి ఒకే వేదికపైకి వచ్చామని పేర్కొన్నారు.