అక్షరటుడే, వెబ్డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ (Congress) నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జస్టిస్ పీసీ ఘోష్(PC Gosh) కమిషన్ ఏర్పాటు చేసింది.
Kaleshwaram Commission | ఈటల ఏం చెప్పనున్నారు..
బీఆర్ఎస్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్కు అంకురార్పణ జరిగింది. ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్(Etala Rajender), నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఉన్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్తో పాటు, ఈటల, హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా జూన్ 6న ఈటల కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఈటల ప్రస్తుతం బీజేపీ(BJP)లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విషయంలో కమిషన్ ముందు ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.
Kaleshwaram Commission | కేసీఆర్ ఆదేశాల మేరకే నిర్ణయాలు
కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే 200 మంది అధికారులను, 25 మంది ఐఏఎస్ అధికారులను విచారించింది. బ్యారేజీల నిర్మాణ సంస్థలు, ఇంజినీర్లు, కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను పరిశీలించింది. కేసీఆర్ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు కమిషన్ ఎదుట చెప్పారు. దీంతో ఆయన వివరణ తీసుకోవడంతో పాటు ఆ సమయంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈటల, హరీశ్రావును విచారించేందుకు కమిషన్ నోటీసులు ఇచ్చింది.
Kaleshwaram Commission | తుది నివేదిక అప్పుడే..
కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసింది. అయితే విచారణ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ క్రమంలో ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన జూన్ 11న హాజరవుతానని కమిషన్కు తెలుపగా.. కమిషన్ అంగీకరించింది. శుక్రవారం ఈటల విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 9న హరీశ్రావును కమిషన్ ప్రశ్నించనుంది. వీరి వాంగ్మూలం సేకరించి జూన్ 30 నాటికి తుది నివేదిక సమర్పించాలని కమిషన్ యోచిస్తోంది.