అక్షరటుడే, ఇందూరు: Nizamabad Excise Enforcement Police : నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు ఓ వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించేందుకు యత్నించారు. చివరికి సదరు వ్యక్తి గట్టిగా నిలదీయడంతో ఎలాంటి కేసు లేకుండా వదిలేశారు. బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి(Nizamabad Excise Station)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులు(Excise officers), సిబ్బందికి ఉన్నతాధికారులు వేర్వేరుగా టార్గెట్ విధించారు. ప్రత్యేకించి గంజాయి(marijuana), ఆల్ఫాజోలం(alpha-zolam) ఇతర నిషేధిత మత్తు పదార్థాలు(drugs) పట్టుకొని కేసులు చేసి టార్గెట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా, ఎక్సైజ్ శాఖలో త్వరలోనే సిబ్బందికి పదోన్నతులు చేపట్టనున్నారు.
ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ ఉన్నతాధికారుల మన్ననలు పొంది, పదోన్నతి అందుకోవాలనే ఉద్దేశంతో భారీ మొత్తంలో ఆల్ఫాజోలం పట్టుకోవాలని ప్రణాళిక రూపొందించారు. తీరా అది సాధ్యం కాలేదు. దీంతో బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కుర్నాపల్లిలో ఓ వ్యక్తికి చెందిన వాహనంలో కొంత ఆల్ఫాజోలం దొరికిందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే సదరు వ్యక్తితో వాహనం, ఆల్ఫాజోలం తీసుకుని ఎన్ఫోర్స్ మెంట్ కార్యాలయానికి తరలించారు.
కాగా, అనంతరం విచారణ చేపట్టిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. సదరు వ్యక్తి చెప్పిన విషయాలకు, కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో లోతుగా విచారణ చేపట్టారు. ఆల్ఫాజోలంతో పట్టుపడిన వ్యక్తి.. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెగేసి చెప్పాడు. కావాలనే తన వాహనంలో ఆల్ఫాజోలం ఉంచి, అరెస్టు చేసినట్లు విచారణలో తెలిపాడు. ఆ తర్వాత చేసేదేమీ లేక సదరు వ్యక్తిని అధికారులు వదిలిపెట్టారు.
కాగా, మరి అమాయకుడిని కేసులో ఇరికించాలని చూసిన ఆ కానిస్టేబుల్కు ఆల్ఫాజోలం ఎక్కడిదనేది అంతుబట్టని ప్రశ్న. మరి ఉన్నతాధికారులు ఆ కోణంలో విచారణ చేపట్టి, ఆ కానిస్టేబుల్(constable)పై చర్యలు తీసుకుంటారా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే.