అక్షరటుడే, వెబ్డెస్క్: Israel-Iran Coflict | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైమానిక దాడులు తీవ్రమవుతున్న తరుణంలో.. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఇరాన్లో ఉన్న భారత పౌరులను (Indian citizens), విద్యార్థులను (students) అర్మేనియా ద్వారా తరలిస్తోంది. వాయువ్య ఇరాన్లోని ఉర్మియా నుంచి దాదాపు 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన మొదటి బృందం అర్మేనియా(Armenia)లోకి ప్రవేశించింది. త్వరలో వారిని స్వదేశానికి తీసుకురానున్నారు. భద్రతా పరిస్థితిని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఇరాన్లోని భారతీయుల రక్షణను సమన్వయం చేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించిన కొన్ని గంటలకే ఇండియన్ల తరలింపు ప్రారంభమైంది.
Israel-Iran Coflict | 600 మంది తరలింపు..
తరలింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (External Affairs Minister S.Jaishankar) అర్మేనియన్ విదేశాంగ శాఖ మంత్రి అరరత్ మిర్జోయన్(Ararat Mirzoyan)తో చర్చలు జరిపారు. “కొన్ని సందర్భాల్లో, రాయబార కార్యాలయం సౌలభ్యంతో విద్యార్థులను ఇరాన్లోని సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇతర సాధ్యమైన ఎంపికలు కూడా పరిశీలనలో ఉన్నాయి” అని తెలిపింది. భారత సంతతికి చెందిన విద్యార్థులను టెహ్రాన్ (Tehran city) నుంచి బయటకు తరలించడానికి సహాయం చేయాలని భారత రాయబార కార్యాలయం అధికారికంగా షిరాజ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్(Shiraz University of Medical Sciences)ను కోరింది. షిరాజ్, ఇస్ఫహాన్ నుంచి విద్యార్థులను యాజ్ద్కు తరలిస్తున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఎదుర్కొన్న టెహ్రాన్ నుంచి దాదాపు 600 మందిని ఇప్పటికే కోమ్కు తరలించారు.
Israel-Iran Coflict | సహకరిస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్..
ఇరాన్లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉండగా, అందులో దాదాపు 6,000 మంది విద్యార్థులే ఉన్నారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారతీయుల తరలింపునకు పూర్తిగా సహకరిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ నుంచి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి టెల్ అవీవ్ “పూర్తి సహకారం” అందిస్తుందని ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ (Effie Defrin) హామీ ఇచ్చారు. మరోవైపు.. ఇరాన్ కూడా భారతీయుల తరలింపునకు సహకారం అందిస్తోంది. భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి చేస్తున్న ఏర్పాట్లను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఈ మేరకు జూన్ 15న పంపిన సమాచారాన్ని రాయబార కార్యాలయం ఉదహరించింది. తరలింపు సమయంలో విద్యార్థుల భద్రతను పర్యవేక్షిస్తామని రాయబార కార్యాలయం తెలిపింది.