అక్షరటుడే, నిజామాబాద్: Nizamabad city | నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పలువురు రియల్టర్లతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు ఖరీదైన స్థలాలను (Lands Grabbing) కబ్జా చేస్తున్నారు. రాత్రికిరాత్రే తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టి భూములను కాజేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు (complaints) అందుతున్నప్పటికీ.. సత్వరమే చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. ఫలితంగా కబ్జారాయుళ్లను అడ్డుకునే వారు లేకుండా పోయారని చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్లో ఇటీవల (Dharmapuri Hills) అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేయించారు. అనుమతులు తీసుకోకపోవడంతో పాటు ప్రభుత్వ స్థలాలను (government land) ఆక్రమించారని గుర్తించారు. తదనంతరం రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులు (police officials) అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టారు.
కాగా.. 12వ నంబరు డివిజన్ పరిధి ధర్మపురి హిల్స్ కాలనీలోని మదీనా ఈద్గా సమీపంలో మరో భూకబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మాజీ కార్పొరేటర్ దాదాపు 600 గజాల ప్రభుత్వ స్థలాన్ని గతంలో కబ్జా చేశాడు. ఇందులో రేకుల షెడ్డుతో నిర్మాణాలు చేపట్టారు. కాగా.. కొంత ఇతరులకు విక్రయించి, మరికొంత స్థలం తన ఆధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. ఈ కబ్జా వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇదే ప్రాంతంలో ఇటీవల కబ్జాలు తొలగించిన రెవెన్యూ అధికారులు (revenue officials) మాజీ కార్పొరేటర్ కబ్జా చేసిన స్థలాన్ని మాత్రం పట్టించుకోకపోవడం కొసమెరుపు.
Nizamabad city | చర్యలు తీసుకునేనా..!
ప్రభుత్వ, అసైన్డ్, శిఖం భూముల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. అయినా పలువురు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇంటి నంబర్ల సాయంతో దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు (registrations) చేసుకుంటున్నారు. అయితే ఇటీవల పలువురి అక్రమ కట్టడాలను కూల్చిన అధికారులు.. చోటా నాయకుల కబ్జాల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాలను తొలగించి ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.