అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP State President | రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తల నిరీక్షణకు తెర పడనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనే విషయం త్వరలో లేలనుంది. జూలై 1ప కమలదళం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నెల 29న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ను పార్టీ అధినాయకత్వం విడుదల చేయనుంది. 30న నామినేషన్లు స్వీకరించి, జులై 1న ఎన్నిక నిర్వహించనున్నారు. అదేరోజు అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై ఎంపీ లక్ష్మణ్ ధ్రువీకరించారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించే వారికే పగ్గాలు అప్పగిస్తామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
BJP State President | నెలలుగా నిరీక్షణ
రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కిషన్రెడ్డి(Kishan Reddy) కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ నుంచి పార్టీ పగ్గాలను కిషన్రెడ్డి అప్పగించారు. అయితే ఆయన పదవికాలం ఎప్పుడో అయిపోయింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే పార్టీలో పోటీ ఎక్కువగా ఉండటంతో ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను ప్రకటించిన పార్టీ తెలంగాణ(Telangana) విషయంలో మాత్రం జాప్యం చేస్తూ వచ్చింది. దీంతో రాష్ట్రంలో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. సరైన మార్గనిర్దేశం లేకపోవడంతో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడికి ఎన్నిక నిర్వహించడానికి పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
BJP State President | స్థానిక ఎన్నికల నేపథ్యంలో..
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు(High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే పార్టీకి లాభం జరుగుతుందని నాయకత్వం భావిస్తున్టన్లు సమాచారం. స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలని కమలం పార్టీ ఇప్పటికే కలలు కంటోంది. సర్పంచులు, జెడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని ఉవ్విళూరుతోంది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడి(BJP State President) నాయకత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కమలదళం యోచిస్తోంది.
BJP State President | రేసులో పలువురు
రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుండడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహంతో పాటు ఉత్కంఠ కూడా నెలకొంది. పార్టీ సారథి ఎవరన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. బీజేపీ నాయకత్వం ఎవరికి అవకాశం ఇస్తుందన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే, అధ్యక్ష పదవి బీసీకి దక్కొచ్చని భావిస్తున్నారు. ఈ పదవిపై చాలా మంది నాయకులు కన్నేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే, అధిష్టానం ఆశీస్సులు ఎవరికీ ఉంటాయన్నదే ఇప్పుడు అందరిలోనూ నెలకొన్న ప్రశ్న. సికింద్రాబాద్ ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకొచ్చిన మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును కూడా పరిశీలించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఎన్నికల బరిలో దిగే అవకాశముంది. అధ్యక్ష పదవికి తన పేరును పరిశీలించాలని ఆయన గతంలోనే అధినాయకత్వానికి విన్నవించుకున్నారు. వీరితో పాటు మరికొంత మంది కూడా పోటీలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే, కొత్త సారథి ఎవరన్న దానిపై కాషాయ దళంతో పాటు ప్రత్యర్థి పార్టీల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.