అక్షరటుడే, వెబ్డెస్క్: EC : పోలింగ్ స్టేషన్ ఫుటేజీని బహిరంగపరచాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్ను శనివారం కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తోసిపుచ్చింది. అలాంటి వీడియో కంటెంట్ను పంచుకోవడం ఓటర్ల గోప్యతను ఉల్లంఘిస్తుందని, ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రమాదం కలిగిస్తుందని పేర్కొంది. ఫుటేజీని విడుదల చేయాలనే డిమాండ్లు పారదర్శకతను ప్రోత్సహించేలా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి అవి ప్రతికూలమైనవి, చట్టపరంగా చెల్లవని ఈసీ తేల్చి చెప్పింది.
ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇటీవల లోక్సభ(Lok Sabha)లో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంలోని సీసీ టీవీ ఫుటేజీ(CCTV footage)ని బహిరంగ పర్చాలన్న రాహుల్ డిమాండ్ సరైందికాదని ఈసీ పేర్కొంది. ఓటర్ల గోప్యత, వారి భద్రతా సమస్యలకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950/1951లో నిర్దేశించిన చట్టపరమైన స్థితికి, సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలకు ఇది విరుద్ధమని తెలిపింది.
EC : గోప్యతకు భంగం కలిగించడమే..
పోలింగ్ స్టేషన్(polling stations)ల నుంచి ఫుటేజీని విడుదల చేయడం ఓటర్ల గోప్యత హక్కుకు, భద్రతకు భంగం కలిగించడమే అవుతుందని ఈసీ వెల్లడించింది. 1950, 1951(Representation of the People Acts of 1950, 1951) నాటి ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం, సుప్రీంకోర్టు సమర్థించినట్లుగా, ఓటరు గోప్యత అత్యంత ముఖ్యమైనదని తెలిపింది. ఫుటేజీని పంచుకోవడం వల్ల ఎవరు ఓటు వేశారో.. లేదా ఓటు వేయకుండా ఉన్నారో.. గుర్తించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. ఓటర్లను స్వార్థ ప్రయోజనాల ద్వారా బలవంతం, వివక్ష లేదా బెదిరింపులకు గురిచేస్తుందని కమిషన్ పేర్కొంది.
పోలింగ్ సమయంలోని వీడియో ఫుటేజీని బయట పెట్టడం ప్రజాప్రతినిధుల చట్టం ఉల్లంఘన కిందికి వస్తుందని, పైగా ఓటు వేయడం, ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని ఈసీ పేర్కొంది. సదరు వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమేనని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని బయట పెడతామని తేల్చి చెప్పింది. ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు కాకపోతే, ఆ తర్వాత ఆయా వీడియో ఫుటేజీలను తొలగించడం సాధారణ ప్రక్రియేనని ఈసీ క్లారిటీ ఇచ్చింది.
EC : బహిర్గతపర్చడం కుదరదు..
ఏదైనా సమూహం లేదా వ్యక్తి, ఓటర్లను సులభంగా గుర్తించడానికి వీలుగా ఫుటేజీలను బహిర్గత పర్చడంవల్ల ఓటు వేసిన ఓటర్లు, ఓటు వేయనివారు ఇరువురూ కూడా సామాజిక వ్యతిరేకుల ఒత్తిడితో పాటు బెదిరింపులకు గురవుతారని ఈసీ తెలిపింది.
అంతేకాదు, ఉదాహరణకు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్ట బూత్లలో తక్కువ ఓట్లు వస్తే.. CCTV ఫుటేజ్ ద్వారా ఏ ఓటరు ఓటు వేశారో, ఏ ఓటరు ఓటు వేయలేదో సులభంగా గుర్తించగలుగుతుంది. ఆ తర్వాత, ఓటర్లను వేధించవచ్చు.. లేదా బెదిరించవచ్చని ఈసీ చెప్పింది. సీసీటీవీ ఫుటేజీలు, వెబ్కాస్ట్ లు అంతర్గత పర్యవేక్షణ యంత్రాంగాలని, ఎన్నికల ప్రక్రియలో చట్టబద్ధంగా తప్పనిసరి అంశాలు కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఓటరు గోప్యతపై తాము ఎప్పుడూ రాజీపడమని స్పష్టం చేసింది.