అక్షరటుడే, వెబ్డెస్క్ : EAPCET | తెలంగాణ ఈఏపీసెట్ EAPCET ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ కోసం ఏప్రిల్ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం మే 2 నుంచి 4 వరకు ఆరు సెషన్లలో ఎగ్జామ్ పెట్టారు. ఈ పరీక్షలు సీబీటీ CBT (ఆన్లైన్) విధానంలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,88,388 విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ క్రమంలో ఫలితాలు విడుదల చేసిన సీఎం విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కులు జాబితాను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ https://eapcet.tgche.ac.in/ ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థుల సెల్ఫోన్లకు నేరుగా ఫలితాలు పంపించారు. ఇంజినీరింగ్ విభాగంలో 73.29శాతం ఉత్తీర్ణత సాధించారు.
EAPCET | టాప్ ర్యాంకర్లు వీరే..
ఇంజినీరింగ్ విభాగంలో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీ పురానికి చెందిన పల్లా భరత్ చంద్ర ఫస్ట్ర్యాంక్ సాధించాడు. రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లికి చెందిన ఉడగండ్ల రామ్చరణ్ రెడ్డి రెండో స్థానంలో నిలిచాడు. ఏపీలోని విజయనగరం జిల్లా పమ్మిన హేమ సాయి సూర్య కార్తిక్ మూడో ర్యాంక్ సాధించాడు. అగ్రికల్చర్ విభాగంలో మేడ్చల్కు చెందిన సాకేత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్, కరీంనగర్కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్యా సెకండ్ ర్యాంక్, వరంగల్కు చెందిన చంద్ర అక్షిత్ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు.