అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తాగుబోతు అర్ధరాత్రి పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశాడు. ఫూటుగా తాగి సదరు ఉన్నతాధికారికి ఫోన్ చేసి బారులో బిల్లు కట్టడానికి డబ్బులు పంపాలంటూ ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో ఉన్న బార్లో ఓ తాగుబోతు నిన్నరాత్రి మస్త్ గా మందేశాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి అతడిది. ఇంతలో వెయిటర్ రూ.3 వేల బిల్లు తీసుకొచ్చి అతగాడికి ఇచ్చాడు. జేబులో డబ్బులు లేకపోవడంతో ఆ తాగుబోతు జేబులో నుంచి ఫోన్ తీసి డయల్ చేశాడు. అదికాస్త పోలీసు ఉన్నతాధికారి(senior police officer)కి వెళ్లింది. ఆ అధికారి ఫోన్ లిఫ్ట్ చేయగానే.. బార్లో రూ.3 వేల బిల్లు అయిందని డబ్బులు పంపాలని సతాయించాడు.
దీంతో ఆ అధికారి నాలుగో ఠాణా పోలీసులకు చెప్పడంతో వారు.. సదరు బార్కు చేరుకున్నారు. అసలు విషయం గ్రహించిన తాగుబోతు అక్కడి నుంచి అప్పటికే పలాయనం చిత్తగించాడు. ప్రస్తుతం పోలీసులు అతగాడి కోసం వెతుకుతున్నారు.