అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్, గంజాయి మాఫియాలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు, యువతే లక్ష్యంగా నగరంలో డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి దొరుకుతుండడంతో పలువురు వాటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల పలువురు నిందితులను అరెస్ట్ చేసినా.. దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా బెంగళూరు (Bengaluru) నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న ఎనిమిది మందిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు రెండు వేర్వేరు చోట్ల దాడులు చేసి మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు బెంగళూరు నుంచి ఎండీఎంఏ (MDMA) తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. వీరితో పాటు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 6.34 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ధూల్పేటలోని బలరామ్గల్లి ప్రాంతంలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్లో 1.248 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళా కూడా ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.