అక్షరటుడే, వెబ్డెస్క్:Fly Over | ప్రస్తుతం నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో వాహనాలు కూడా పెరిగి ట్రాఫిక్ సమస్యలు(Traffic Problems) తలెత్తున్నాయి.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు (Fly Overs) నిర్మిస్తున్నాయి. అయితే వాహనాల రద్దీకి ఆ ఫ్లై ఓవర్లు కూడా సరిపోకపోవడంతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లను కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు నిర్మించగా.. తాజగా బీహార్లో రెండంతస్తుల ప్లై ఓవరు అందుబాటులోకి రానుంది.
బీహార్ రాజధాని పాట్నాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (Double decker flyover) నిర్మించారు. అయితే దీని నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్న జాప్యం జరుగుతోంది. తాజాగా దీని ప్రారంభం తేదీని జూన్ మొదటి వారానికి వాయిదా వేశారు. జూన్లో ఈ వంతెనను అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.422 కోట్లతో 2.2 కిలో మీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. జనవరిలోనే దీనిని ప్రారంభించాల్సి ఉంది. అయితే పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఐదోసారి గడువు పొడిగించినట్లు బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ (BRPNNL) అధికారులు తెలిపారు
పాట్నాలోని కార్గిల్ చౌక్ నుంచి సైన్స్ కాలేజీ వరకు 2.2 కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. అయితే లైటింగ్, రెయిలింగ్లు, సౌండ్ బారియర్స్, థర్మోప్లాస్టిక్ మార్కింగ్లు, ట్రాఫిక్ సంకేతాలు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. ఫ్లై ఓవర్(Fly Over) కింద రోడ్డు మరమ్మతులు చేపడుతున్నారు. దీంతో ఈ పనులు పూర్తి చేసి జూన్లో ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ను అందుబాటులోకి తీసుకు రానున్నారు.
Fly Over | ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి..
రెండంతస్తుల ఈ ఫ్లై ఓవర్తో ట్రాఫిక్ సమస్య(Traffic Problem)కు కొంత మేర పరిష్కారం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఫ్లై ఓవర్ దిగువ స్థాయి 1.5 కి.మీ ఉంది. పాట్నా కళాశాల నుంచి బిఎన్ కళాశాల వరకు వన్-వే ట్రాఫిక్(One way traffic)ను అనుమతి ఇవ్వనున్నారు. అదే సమయంలో 2.2 కి.మీ. ఉన్న పై డెక్ కార్గిల్ చౌక్ నుంచి సైన్స్ కళాశాల వరకు వన్-వే ట్రాఫిక్కు ఉపయోగపడుతుంది. దీంతో వాహనదారులకు సమయం ఆదా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకు రావాలని బీహార్ సీఎం నితీశ్కుమార్ (Bihar CM Nitish Kumar) చూస్తున్నారు.