అక్షరటుడే, వెబ్డెస్క్: Banakacharla Project | తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చే అవసరం లేదని తేల్చి చెప్పింది.
జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేసింది. అయితే, ఈ భేటీలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం(AP Government) సింగిల్ ఎజెండా ఇచ్చింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ముఖ్యమంత్రుల భేటీలో బనకచర్లపై చర్చ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వేరే అంశాలపై చర్చిద్దామని ప్రతిపాదించింది.
Banakacharla Project | కృష్ణా ప్రాజెక్టులపై చర్చకు ఓకే..
బనకచర్ల మినహా మిగిలిన అంశాలపై చర్చిద్దామని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సూచించింది. ప్రధానంగా కృష్ణా నది పరివాహకంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై చర్చించడానికి గాను ఏజెండాను ప్రతిపాదించింది.
కృష్ణ నదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన ఎజెండాను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపించింది.
అయితే, ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఉదయాన్నే కేంద్రానికి మరో లేఖ రాసింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని లేఖలో స్పష్టం చేసింది.
Banakacharla Project | అనుమతుల్లేని ప్రాజెక్టుపై చర్చకు నో..
బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) నిర్మాణ ప్రతిపాదనకు అనుమతులే లేవని, ఇక దానిపై చర్చించాల్సిన అవసరం ఏముందని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది. జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని గుర్తు చేసింది.
ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను లేఖలో ప్రస్తావించింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని తేల్చి చెప్పింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అసహనం వ్యక్తం చేసింది.