అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని.. అప్పుడే ప్రజా నాయకులవుతామని.. కానీ పదవుల కోసం పాకులాడితే కుదరదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్ (Shubham Convention Hall)లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో (Congress party wide meeting) ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలన్నారు. ప్రజలకు సేవచేసేందుకు పనిచేయాలన్నారు. యంత్రాంగంలో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చిన్నచిన్న గొడవలకు వివాదాలుగా మారిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఇన్ని రోజులు కార్యకర్తలు తమ గెలుపు కోసం కష్టపడ్డారని.. ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం వచ్చిందన్నారు. వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులుగా తీర్చిదిద్దుతామన్నారు. క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు లక్ష్మీ కాంతారావు, మదన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ రాష్ట్ర ఛైర్మన్ కాసుల బాలరాజ్, జిల్లా ఇన్ఛార్జీలు, సత్యనారాయణ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, నాయకుకు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Shabbir Ali | ఆర్టీసీలో 8 గంటల పనివిధానాన్ని అమలు చేయాలి..
ఆర్టీసీలో 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ ఎస్డబ్ల్యూయూ నాయకులు కోరారు. శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి వినతిపత్రం అందజేశారు. మహాలక్ష్మి పథకంతో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఓటీ చేస్తున్నామన్నారు. వేసవి ముగిసేవరకు ఓటీని రద్దు చేయాలని వారు విన్నవించారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యుయూ అధ్యక్షుడు ఖదీర్, కార్యదర్శి రమేష్, కోశాధికారి రాజు, స్టేట్ కమిటీ ఛైర్మన్ రాజులు, జాయింట్ సెక్రటరీ సంగారెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.