అక్షరటుడే, వెబ్డెస్క్: Cabinet Expansion | మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) అసంతృప్తి భగ్గుమంది. పదవి వస్తుందని ఆశపడి భంగపాటుకు గురైన నేతలు అంతర్గతంగా రగిలి పోతున్నారు. ప్రధానంగా రెడ్డి (Reddys) సామాజికవర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతున్నారు.
దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకున్న తమకు మొండి “చేయి” చూపడంపై హస్తం పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు మనస్తాపానికి లోనయ్యారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో ఎన్నో అవమానాలను తట్టుకుని నిలబడిన తమను ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం సరికాదని, తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే, అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం రంగంలోకి దిగింది. అసంతృప్తితో ఉన్న నేతలకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ (PCC Chief Mahesh kumar goud), మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు సర్దిచెబుతున్నారు.
Cabinet Expansion | నిరాశలో సీనియర్లు..
దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడంతో ఎంతో మంది సీనియర్లు మంత్రి పదవులపై (Minister Posts) ఆశలు పెట్టుకున్నారు. కానీ మొదటి విస్తరణలో కొంత మందికే అవకాశం దక్కగా, ప్రస్తుత విస్తరణలో ముగ్గురికి మాత్రమే చోటు దక్కింది. ఆ ముగ్గురూ తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలే. దాదాపు ఏడాదిన్నర తర్వాత జరిగిన మలి విడత విస్తరణలో తమకు ఛాన్స్ వస్తుందని ఆశ పెట్టుకున్న సీనియర్లకు నిరాశే మిగిలింది. ఈసారి కచ్చితంగా పదువులు వరిస్తాయని భావించిన వారందరికీ భంగపాటే ఎదురైంది.
నిజామాబాద్ జిల్లాకు (Nizamabad District) చెందిన సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA SUdharshan reddy), మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ (Balu Nayak) తమకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మొదట్నుంచి వచ్చిన ఊహాగానాల్లోనూ వీరి పేర్లే ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరకు అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం వారికి మొండి చేయి చూపింది. దీంతో వీరు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Cabinet Expansion | బుజ్జగింపుల పర్వం..
కేబినెట్ విస్తరణ (Cabinet Expansion) కాంగ్రెస్కు కొత్త తలనొప్పి తెచ్చింది. కష్టకాలంలోనూ కాంగ్రెస్ వెంట నడిచి, బీఆర్ఎస్ (BRS) ప్రలోభాలకు లొంగకుండా పార్టీని పట్టుకుని ఉన్నందుకు తగిన శాస్తి జరిగిందని లోలోపల రగిలి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ను వీడాలన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాహుల్గాంధీకి (Rahul Gandhi) లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. ఆయన పార్టీకి, పదవికి రాజీనామా (Resign) చేసే అవకాశముందని ప్రచారం జోరందుకుంది. సీనియర్లు అసంతృప్తికి లోను కాగా కాంగ్రెస్ (Congress) నాయకత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది.
పదవి రాకపోవడంతో అసంతృప్తికి లోనైన సీనియర్ నేతలు సుదర్శన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komat Reddy Rajgopl Reddy) సహా కీలక నేతలను అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది. మంత్రివర్గంలో తనకు స్థానం లభించకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సుదర్శన్రెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన నివాసానికి ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ (meenakshi natarajan), టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud), మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్ వెళ్లారు. ఆయనతో సంప్రదింపులు జరిపారు. సుదర్శన్రెడ్డితో చర్చల అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్రావుతో మాట్లాడేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే వారిద్దరూ అందుబాటులో లేకుండా పోయారు.