అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | కామారెడ్డి జిల్లా రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. గతంలో ఉన్న గ్రూపులకు తోడు ఇప్పుడు మరొక గ్రూపు తయారైనట్టుగా తెలుస్తోంది.
ఈ పరిణామం జిల్లా కాంగ్రెస్ పార్టీని (Congress Party) కుదేలు చేస్తోంది. దీంతో ముఖ్య నాయకులంతా టీపీసీసీ చీఫ్ను కలిసి పార్టీ పరిస్థితిపై మొరపెట్టుకున్నట్టు వినిపిస్తోంది. పార్టీ ప్రతిష్టను దిగజార్చే నాయకులను సస్పెండ్ చేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.
పదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి జిల్లా రాజకీయాలు (Kamareddy district politics) తలనొప్పిగా మారాయి. ఇక్కడి నేతల గ్రూపు రాజకీయాలతో పార్టీ ప్రతిష్ట మసకబారుతుందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పదవుల పంపకాలలో వచ్చిన వివాదం గాంధీభవన్ వరకు చేరింది.
ప్రత్యేకించి నియోజకవర్గ నేతలు వ్యవహరిస్తున్న తీరును ఇదివరకే కొందరు నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. ఇటీవల కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన పలు పరిణామాలు పార్టీ ముఖ్య నేతల్లో అంతర్గతంగా ఉన్న విభేదాలను ఒక్కసారిగా బయటపెట్టాయి.
Kamareddy Congress | చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుతో..
కామారెడ్డి నియోజకవర్గానికి (Kamareddy constituency) చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుతో నియోజకవర్గంలో తీవ్ర చర్చ మొదలైంది. అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. తీరా బెయిల్పై బయటకు వచ్చారు.
కాగా.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని (State Government Advisor Shabbir Ali) ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టుకు సదరు నేత కారణమంటూ ఘాటుగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ చేశారని, దీని వెనుక కామారెడ్డికి చెందిన ఓ పెద్దాయన హస్తం ఉందని ఆరోపించారు. ఓ 70 ఏళ్ల పెద్దమనిషి వెనకుండి మరీ ఇదంతా నడిపిస్తున్నారని షబ్బీర్ అలీని ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు.
ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ (Party High Command) దృష్టికి కూడా తీసుకెళ్లానని, పార్టీ తన పట్ల సానుకూలంగా ఉందన్నారు. తనపై కుట్రలు చేసిన పెద్ద మనిషి, అతని కొడుకు, తమ్ముడు, అన్న కొడుకు అందరి వివరాలు తనవద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు ఆధారాలతో సహా వారిపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పడం కామారెడ్డి రాజకీయాల్లో (Kamareddy district politics) దుమారం రేపుతోంది.
Kamareddy Congress | అధిష్టానానికి ఫిర్యాదు..
మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పార్టీ నేతలు కొందరు గుర్రుగా ఉన్నారు. ఆయనపై టీపీసీసీ చీఫ్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా నెలకొన్న వివాదాలతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని, పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారని తెలిసింది. లేనిపక్షంలో తాము మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని.. షబ్బీర్ అలీ వర్గీయులు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పినట్టుగా సమాచారం.
Kamareddy Congress | స్థానిక ఎన్నికల వేళ..
అతిత్వరలోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో పార్టీ ముఖ్య నేతలు, నాయకులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. కాగా.. కామారెడ్డి జిల్లాలో (kamareddy district) మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వారి వ్యవహారశైలి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ సైతం తాజా పరిణామాలను సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జిల్లా నేతలందరితో పీసీసీ చీఫ్ భేటీ నిర్వహించే అవకాశం ఉంది.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘