అక్షరటుడే, వెబ్డెస్క్: Jeevan Reddy | బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో అసంతృప్తి రాజుకుంటోంది. ముఖ్య నేతల తీరుపై అసమ్మతి వెల్లువెత్తుతోంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర నిరాశలో ఉన్న పార్టీ కేడర్ నిరసన గళమెత్తుతోంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడకపోవడం, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండకపోవడం, అధికార పార్టీ నేతల వేధింపులకు వ్యతిరేకంగా మద్దతుగా నిలవకపోవడం తదితర కారణాల వల్ల కేడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ముఖ్య నాయకుల వైఖరి నచ్చక చాలా మంది సీనియర్లు, కార్యకర్తలు ఇప్పటికే గులాబీ జెండాను వదిలేసి, పక్క పార్టీల్లో చేరిపోయారు. అయినప్పటికీ, నాయకుల తీరు మాత్రం మారలేదు.
Jeevan Reddy | జీవన్రెడ్డిపై శ్రేణుల ధ్వజం
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి(Jeevan Reddy) వ్యవహార తీరుతో కేడర్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన ఎన్నికల సమయంలో తప్పితే గత పదేళ్లలో నియోజకవర్గ ఏమాత్రం పట్టించుకోలేదని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. రెండ్రోజుల క్రితం కొందరు సొంత పార్టీ నాయకులు జీవన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెట్టి ఆయనపై విరుచుకుపడ్డారు. జీవన్రెడ్డి కారణంగానే ఆర్మూర్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేసీఆర్(KCR) అధికారంలో ఉన్నప్పుడు జీవన్రెడ్డి చేయని అరాచకం లేదని మండిపడ్డారు. తనకు ఎదురుతిరిగిన వారిపై కేసులు పెట్టి వేధించడం వంటివి ఎన్నో చేశారని వెల్లడించారు. జీవన్రెడ్డి తీరుపై త్వరలోనే కేసీఆర్, కేటీఆర్(KTR)ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆయనను నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయనను కొనసాగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని అంటున్నారు.
Jeevan Reddy | కేడర్ను పట్టించుకోని నేతలు..
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. తొమ్మిది నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీకి మంచి పట్టుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) అనూహ్యంగా ఓటమి మూటగట్టుకుంది. బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లోనే గెలుపొందగా, మిగతా చోట్ల పరాభవమే మిగిలింది. ఎన్నికల తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటే కేడర్ మొత్తం వెళ్లిపోయింది. ఇక, మిగతా నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. బలమైన కేడర్ను కాపాడుకోవడంలో ముఖ్య నాయకత్వం విఫలమవుతోంది. హైదరాబాద్కే(Hyderabad) పరిమితం కావడం, అధికార పార్టీ వేధిస్తుంటే కార్యకర్తలకు మద్దతుగా రాకపోవడంతో గులాబీ శ్రేణుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది.