అక్షరటుడే, వెబ్డెస్క్: Operation sindoor | సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్(Pakistan)ను అన్ని విధాలుగా కట్టడి చేసేందుకు భారత్(India) తనకు ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకుంటోంది. ఈ క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తదితర వివరాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రత్యేక బృందాన్ని విదేశాలకు పంపించనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్తో పాటు పీవోకేలోని టెర్రరిస్టులతో పాటు వాళ్లకు అంటకాగుతున్న పాక్ ఆర్మీ(Pakistan Army)కి ఇండియా వణుకు పట్టించింది. డ్రోన్లు, మిసైళ్ల దాడులతో శత్రుదేశానికి నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడు పాక్పై దౌత్య యుద్ధానికి కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ దేశాల ముందు పాక్ బండారాన్ని బయటపెట్టేందుకు, ఆ దేశ ఉగ్ర కుట్రల్ని అందరికీ అర్థమయ్యేలా విశదీకరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ, ఇందులో ఆ పార్టీ ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor)కు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ చెప్పకపోయినా.. శశిథరూర్కు ఆహ్వానం పంపింది సర్కారు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
Operation sindoor | కాంగ్రెస్ దెబ్బ.. కేంద్రం ఎదురుదెబ్బ
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు వెళ్లే అఖిలపక్ష బృందంలో పాల్గొనే ఎంపీల పేర్లు ఇవ్వాలని కేంద్రం అన్ని పార్టీలకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మీ ఎంపీల పేర్లతో లిస్ట్ను పంపాలంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Minister Kiren Rijiju) కాంగ్రెస్ పార్టీని కోరారు. దీంతో నలుగురు ఎంపీలతో కూడిన జాబితాను కాంగ్రెస్ శనివారం పంపించింది. ఇందులో ఎంపీలు ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ పేర్లు ఉండగా, లిస్ట్లో కచ్చితంగా పేరుంటుందని అందరూ ఊహించిన శశిథరూర్ పేరు మాత్రం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
Operation sindoor | థరూర్పై హస్తం గుస్సా..
కొద్దికాలంగా శశిథరూర్(Shashi Tharoor) వైఖరిలో మార్పు కనిపిస్తోంది. కేంద్రానికి మద్దతుగా ఆయన మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి నచ్చలేదు. ఇటీవల కేరళలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ(Prime Minister Modi)తో కలిసి థరూర్ పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన లక్ష్మణ రేఖ దాటుతున్నారని పలువురు సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. వాస్తవానికి థరూర్కు హస్తం పార్టీలో మంచి వాగ్దాటిగా, విలక్షణ నాయకుడిగా మంచి పేరుంది. కానీ, ఎందుకో కొంతకాలంగా ఆయన బీజేపీ(BJP)కి దగ్గరవుతున్నట్లు చెబుతున్నారు. విదేశాలకు వెళ్లే ప్రతినిధి బృందానికి ఆయనే నాయకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, కేంద్రం ఎంపీల జాబితా అడిగితే శశిథరూర్ పేరు లేకుండా మిగతా నలుగురిని పేర్లను కాంగ్రెస్ పంపించింది.
Operation sindoor | కేంద్రం ఊహించని ట్విస్ట్..
కాంగ్రెస్ పార్టీ శశిథరూర్ పేరు ఇవ్వనప్పకటికీ, కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆయన పేరును ప్రతిపాదించింది. హస్తం పార్టీ జాబితా పంపించిన కాసేటికే కేంద్రం ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ నుంచి శశిథరూర్ పేరు ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హస్తం పార్టీ పంపిన జాబితాలో థరూర్ పేరు లేకపోయినా ఆయన పేరును కేంద్రం ప్రకటించడం, విదేశానికి పంపనున్నట్లు వెల్లడించడం హాట్ టాపిక్గా మారింది. ఏడు బృందాలకు ఏడుగురు నాయకత్వం వహించనున్నారు. అందులో కాంగ్రెస్ నుండి శశిథరూర్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, బీజేపీ నుంచి బైజయంత్ పాండా, డీఎంకే నుంచి కనిమొళి కరుణానిధి, ఎన్సీపీ నుంచి సుప్రియా సులే, శివసేన నుంచి ఏక్నాథ్ షిండే ఉన్నారు. అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాటంలో భారత వైఖరిని అఖిలపక్ష ప్రతినిధులు ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. శశిథరూర్ అమెరికాకు, బైజయంత్ పాండా యూరప్కు, కనిమొళి రష్యాకు, శ్రీకాంత్ షిండే ఆఫ్రికాకు, రవిశంకర్ ప్రసాద్ గల్ఫ్ దేశాలకు ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు.
Operation sindoor | అమెరికాకు శశి ప్రతినిధి బృందం
అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తారు. ఈ బృందంలో సభ్యులుగా శాంభవి చౌదరి, సర్ఫరాజ్ అహ్మద్, సుదీప్ బందోపాధ్యాయ, హరీశ్ బాలయోగి, శశాంక్ మణి త్రిపాఠి, భువనేశ్వర్ కలిత, మిలింద్ దేవరా ఉన్నారు. ఈ బృందంలో అమెరికాలోని మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధు, హిందూ మహాసముద్ర ప్రాంతం (IOR) డైరెక్టర్ వరుణ్ జెఫ్ కూడా ఉన్నారు, వీరు ప్రతినిధి బృందానికి అనుసంధాన అధికారిగా వ్యవహరిస్తారు. జపాన్కు వెళ్లే భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి జనతాదళ్ యునైటెడ్ (JDU) నుంచి ఎంపీ సంజయ్ ఝా నాయకత్వం వహిస్తారు. ఈ బృందంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విదేశాంగ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, రిటైర్డ్ దౌత్యవేత్త మోహన్ కుమార్, మాజీ క్రికెటర్, ప్రస్తుత ఎంపీ యూసుఫ్ పఠాన్, ఎంపీలు హిమాంగ్ జోషి, జాన్ బ్రిట్టాస్ (CPI-M), విక్రమ్జిత్ వర్ష్నే, ప్రధాన్ బారువా మరియు భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి అపరాజిత సారంగి ఉన్నారు. “అత్యంత ముఖ్యమైన క్షణాల్లో, భారత్ ఐక్యంగా ఉంటుంది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనే మా ఉమ్మడి సందేశాన్ని మోసుకెళ్లి ఏడు అఖిలపక్ష ప్రతినిధులు త్వరలో కీలక భాగస్వామి దేశాలను సందర్శిస్తారు” అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, ‘X’లో ఒక పోస్ట్లో తెలిపారు.