Site icon aksharatoday.in

BJP Telangana | బీజేపీలో భిన్నాభిప్రాయాలు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై త‌లో మాట‌

BJP Telangana

BJP Telangana | బీజేపీలో భిన్నాభిప్రాయాలు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై త‌లో మాట‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Telangana | భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP)లో అంత‌ర్గ‌త విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కొంద‌రు ముఖ్య నాయ‌కులు పార్టీ స్టాండ్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతుండ‌డం ఇప్పుడు కాషాయ వ‌ర్గాల‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ధానంగా కాళేశ్వ‌రం (Kaleshwaram) విష‌యంలో కీల‌క నాయ‌కులు త‌లో మాట చెబుతుండ‌డం పార్టీ శ్రేణులను గంద‌ర‌గోళానికి గురి చేస్తోంది. కాళేశ్వ‌రం విష‌యంలో బీజేపీ తొలి నుంచి ఒకే స్టాండ్‌తో ఉంది. ప్రాజెక్టు పేరుతో వేలాది కోట్ల డ‌బ్బును నొక్కేస్తున్నార‌ని ఆరోపిస్తూ వ‌స్తోంది. కాళేశ్వ‌రం బీఆర్ ఎస్‌కు ఏటీఎంగా మారింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) నుంచి రాష్ట్ర నాయ‌క‌త్వం వ‌ర‌కూ అంద‌రూ ఆరోప‌ణ‌లు చేశారు. అయితే పార్టీ స్టాండ్‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డంతో ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

BJP Telangana | ప్రాజెక్టును స‌మ‌ర్థించిన ఈట‌ల

బీజేపీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టిన చిచ్చు బ‌య‌ట‌కు వ‌చ్చింది. సికింద్రాబాద్ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (MP Eatala Rajendar) ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదేనని, ప్రాజెక్ట్‌కు పెట్టిన డబ్బులు వృథా కాలేదని ఈటల ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. మ‌రోవైపు కాళేశ్వ‌రం నిర్మాణానికి కేబినెట్ అనుమ‌తి లేద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం చెబుతుండ‌గా, దాన్ని ఈట‌ల ఖండించారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ (Kaleshwaram Commission) విచార‌ణ తుది ద‌శ‌కు చేరుతున్న త‌రుణంలో ఇటీవ‌ల విచార‌ణ‌కు హాజ‌రైన ఈట‌ల‌.. ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ అనుమ‌తి ఉంద‌ని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు విష‌యంలో బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తుగా ఆయ‌న మాట్లాతుండ‌డం బీజేపీలో చిచ్చు రేపింది.

BJP Telangana | బండి విమ‌ర్శ‌లు

పార్టీ విధానానికి విరుద్ధంగా ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతుండ‌డంపై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ప‌రోక్షంగా ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల గుప్పించారు. కాళేశ్వ‌రం విష‌యంలో తమ పార్టీ స్టాండ్ ఒక్కటేనన్నారు. పార్టీ అధ్యక్షుడు అయితేనో, కేంద్ర మంత్రిగా ఉంటేనో త‌మ‌ స్టాండ్ మారదని కుండబద్దలు కొట్టారు. బీజేపీలో ఉంటే.. బీజేపీ స్టాండే మాట్లాడాలి కానీ వ్యక్తిగతమంటూ ఏమీ ఉండదని ఈట‌లనుద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయిందని పున‌రుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఈటల రాజేందర్ అభిప్రాయానికి మేము పూర్తి భిన్నని పేర్కొన్న బండి సంజయ్.. తాము ఊసరవెల్లి కాదని వ్యాఖ్యానించారు. కేబినెట్‌లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్న ఈట‌ల వ్యాఖ్య‌ల‌ను బండి ఖండించారు. ఈ విష‌యాన్ని ఎవరూ నమ్మరన్నారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్ అంతా ఉత్తదేనని ఆయన పేర్కొన్నారు.

BJP Telangana | గంద‌ర‌గోళంలో కాషాయ ద‌ళం

కాళేశ్వ‌రం ప్రాజెక్టును స‌మ‌ర్థిస్తూ ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడ‌డం, ఆయ‌న వైఖ‌రిని బండి సంజ‌య్ బ‌హిరంగంగానే ఖండించ‌డం బీజేపీ శ్రేణులను గంద‌ర‌గోళంలోకి నెట్టేసింది. రాష్ట్రంలో ఇప్ప‌టికే స‌రైన ద‌శ‌దిశా లేకుండా సాగుతున్న కాషాయ పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు మ‌రింత త‌ల‌నొప్పిగా మారాయి. ముఖ్య‌మైన నేత‌ల మ‌ధ్య విభేదాలు, ఆధిప‌త్య పోరు కార‌ణంగా ఆ పార్టీ రాష్ట్రంలో బ‌లోపేతం కాలేక‌పోతోంది. వాస్త‌వానికి బండి సంజ‌య్ ఉన్న స‌మ‌యంలో పార్టీలో స‌రికొత్త జోష్ నెల‌కొంది. అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలతో బీజేపీ బ‌లం అనూహ్యంగా పెరిగింది. కానీ ఇది గిట్ట‌ని కొంద‌రు నాయ‌కులు వ‌రుస‌గా అధిష్టానానికి ఫిర్యాదులు చేయ‌డంతో ఆయ‌న‌ను త‌ప్పించి.. సుతిమెత్త‌గా వ్య‌వ‌హరిస్తార‌న్న పేరొందిన కిష‌న్‌రెడ్డి (Kishan Reddy)కి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే ఆ స‌మ‌యంలోనే బీఆర్ఎస్ నుంచి విలీన ప్ర‌తిపాద‌న రావ‌డంతో అధిష్టానం బండి జోరుకు బ్రేక్‌లు వేసిన‌ట్లు ఇటీవ‌ల ఎమ్మెల్సీ క‌విత (MLC Kavitha) చేసిన వ్యాఖ్య‌ల‌తో తేలిపోయింది. అయితే పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌పై బీజేపీ హైక‌మాండ్ దృష్టి సారించ‌క పోవ‌డంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగ‌లేక పోతోంది.

Exit mobile version