అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. అందిన కాడికి దండుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. లంచాల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ఇటీవల ఏసీబీ (ACB) దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. భయపడకుండా లంచాలు (Bribe) డిమాండ్ చేస్తున్నారు. కొందరు అవినీతి అధికారులు అయితే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. ఏసీబీ ఇలా అవినీతికి పాల్పడుతున్న అధికారుల ఆట కట్టిస్తోంది. తాజాగా ఓ డీఈవో, జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరేందుకు ఇటీవల ములుగు (Mulugu) జిల్లా విద్యాశాఖాధికారి(DEO) గొర్ల పాణికి వినతి పత్రం ఇచ్చారు. సదరు వ్యక్తి విధుల్లో చేరేందుకు ఆదేశాలు ఇచ్చేందుకు డీఈవో రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల (ACB Officials)కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం లంచం తీసుకుంటుడగా డీఈవో గొర్ల పాణితో పాటు, జూనియర్ అసిస్టెంట్ దిలీప్కుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ACB Trap | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)కు ఫోన్ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.