అక్షరటుడే, కామారెడ్డి: Dengue | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (joint Nizamabad district) డెంగీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసులు నమోదవుతున్నాయి. విష జ్వరాలతో బాధపడుతున్న రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కాగా.. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో (Palvancha mandal) డెంగీ కలకలం సృష్టిస్తోంది. ఒకే గ్రామంలో 20 మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.
పాల్వంచ మండలం భవానీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్నగర్ లో డెంగ్యూ (Dengue) కలకలం రేపింది. దాదాపు ఇంటికొకరు చొప్పున డెంగీ బారిన పడ్డారు. గత 15 రోజులుగా పలువురు జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వైద్యులు కాలనీలో రెండు మూడు రోజులుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో సుమారు 20 మందికి డెంగీ పాజిటివ్ (dengue positive) నిర్ధారణ అయ్యింది. అందులో చిన్నారులు, వృద్ధులు సైతం ఉన్నారు.
డెంగీ సోకిన వారు కొందరు జీజీహెచ్, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో (private hospitals) చికిత్స పొందుతున్నారు. డెంగీ లక్షణాలు ఉన్నవారికి గ్రామంలోనే వైద్యులు మందులు అందజేస్తున్నారు. దోమల వ్యాప్తి వల్లనే డెంగ్యూ సోకినట్టుగా ప్రజలు చెబుతున్నారు. దాంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రెయినేజీలు, రోడ్లను శుభ్రం చేస్తున్నారు. వైద్య సిబ్బంది కాలనీలోనే ఉంటూ డెంగీ బాధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాలనీలో ప్రత్యేకంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.