అక్షరటుడే, వెబ్డెస్క్ : Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) వేములవాడలో సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు నిర్మాణం కోసం భవనాలు కూల్చి వేస్తుండడంతో యజమానులు అడ్డుకున్నారు. భవనాలపైకి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
వేములవాడ రాజన్న క్షేత్రానికి(Vemulawada Rajanna Kshetram) నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ జనాభా కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. అయితే రోడ్లు ఇరుకుగా ఉండడంతో ఆలయానికి వచ్చే భక్తులు(Devotees) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా రోడ్లు విస్తరించాలని ప్రతిపాదనలు ఉన్నా ముందుకు సాగలేదు. గతంలో నగర పంచాయతీగా ఉన్న వేములవాడ (Vemulawada)ను బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీగా మార్చారు. అయినా రోడ్ల విస్తరణకు మాత్రం మోక్షం లభించలేదు.
Vemulawada | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..
రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక వేములవాడ ఆలయ అభివృద్ధిపై చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Aadi Srinivas) ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) గతంలో ఆలయానికి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఇందులో భాగంగా వేములవాడ పట్టణంలో రోడ్లను కూడా విస్తరిస్తున్నారు. రోడ్డు పనుల కోసం ఇరువైపులా ఉన్నా భవనాలను కూల్చి వేస్తున్నారు. ఇప్పటికే పలువురికి పరిహారం అందజేసి, భవనాలు కూల్చివేశారు. వేములవాడలో రెండో వంతెనను నిర్మాణం కోసం సోమవారం ఉదయం తిప్పాపురం బస్టాండ్ (Thippapuram Bus Stand) ఎదురుగా ఉన్న నిర్మాణాల తొలగింపు చేపట్టారు.
Vemulawada | అడ్డుకున్న స్థానికులు
రోడ్డు విస్తరణ కోసం భవనాలు తొలగించడానికి అధికారులు తెల్లవారుజామునే జేసీబీలతో వచ్చారు. వారిని అడ్డుకునేందుకు ఇళ్ల యజమానులు (House Owners) యత్నించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులకు నిర్వాసితులకు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయినట్లు సమాచారం. నష్టపరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అయితే పరిహారం కోర్టులో జమ చేశామని అధికారులు తెలిపారు.
వేములవాడలోని మూలవాగుపై ఇప్పటికే ఒక వంతెన ఉంది. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నేపథ్యంలో రెండో వంతెన నిర్మిస్తున్నారు. భూ సేకరణం కోసం గతంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 30 మంది భవనాల కూల్చివేత చేపట్టారు. అయితే అధికారులు అర్ధరాత్రి వచ్చి ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పారని స్థానికులు పేర్కొన్నారు. తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అయితే వారిని అక్కడి నుంచి తరలించిన పోలీసులు కూల్చివేతలు చేపట్టారు.