అక్షరటుడే, బోధన్: Navipet | లారీ ఢీకొట్టిన ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బినోల గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్ నవీపేట్లో సీడ్స్షాప్ నిర్వహిస్తున్నాడు. తన కూతురు తేజస్విని నిజామాబాద్లోని (Nizamabad ) ఎస్ఆర్ కళాశాలలో (SR Inter college) ఫస్ట్ ఇయర్లో చేర్పించారు. సోమవారం కళాశాలలో వదిలిపెట్టేందుకు నవీపేట్ నుంచి గంగాధర్ బైక్పై కూతురితో బయలుదేరాడు. అయితే నవీపేట్ మెయిన్ సెంటర్లో వీరి బైక్ను వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో గంగాధర్ ఎడమవైపు పడిపోగా.. తేజస్విని కుడివైపుకు పడిపోవడంతో లారీ టైర్లు ఆమె తలపైనుంచి వెళ్లాయి. దీంతో తేజస్విని తలపగిలి సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. కళ్లముందే కూతురు మృతి చెందడంతో గంగాధర్ అల్లాడిపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Navipet | ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్..
నవీపేట మెయిన్ సెంటర్లో వాహనాల పార్కింగ్ ఇష్టారాజ్యంగా మారడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు స్పందించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు.