అక్షరటుడే, వెబ్డెస్క్ :Jeedimetla | ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్(Smart Phone) ఉంది. అందరు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే టీనేజీ పిల్లలు, యువత సోషల్ మీడియా(Social Media)కు బానిసలుగా మారుతున్నారు. ఆన్లైన్లో కొత్త స్నేహాలను వెతుక్కొని తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. ప్రేమ పేరుతో చిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని జీడిమెట్ల(Jeedimetla)లో పదో తరగతి చదవుతున్న ఓ బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.
హైదరాబాద్(Hyderabad) శివారులోని జీడిమెట్లలో అంజలి అనే మహిళను ఆమె కూతురు తన ప్రియుడు శివ (19), అతడి సోదరుడు యశ్వంత్(18)తో కలిసి హత్య చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పదో తరగతి చదువుతున్న బాలిక తన తల్లిని చంపించడంతో సమాజం ఎటు పోతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే తన తల్లి హత్యపై ఆమె చిన్న కుమార్తె సంచలన విషయాలు వెల్లడించింది. శివ, యశ్వంత్ తన తల్లిపై దాడిచేశారని బాలిక చెప్పింది. చనిపోయారనుకొని వారు వెళ్లిపోయారంది. అయితే తన తల్లి చనిపోకపోవడంతో అక్క మళ్లీ తన ప్రియుడికి ఫోన్ చేసి పిలిచిందని బాలిక ఏడుస్తూ చెప్పింది. దీంతో శివ, యశ్వంత్ వచ్చి తన తల్లిని సుత్తితో కొట్టి చంపారని వెల్లడించింది.
Jeedimetla | అమ్మ చనిపోయింది.. లేపి వేస్ట్
తాను ట్యూషన్ నుంచి వచ్చే సరికి అమ్మ రక్తపు మడుగులో పడి ఉందని చెప్పింది. అయితే అప్పటికి తన తల్లి చనిపోకపోవడంతో నిందితురాలు మళ్లీ శివకు ఫోన్ చేసిందన్నారు. తన కళ్ల ముందే వారు తల్లిని చంపారని వాపోయింది. అంజలి దగ్గరికి వెళ్లి తాను లేపడానికి ప్రయత్నించినట్లు చిన్న కూతురు తెలిపింది. అయితే నిందితురాలు మాత్రం అమ్మ చనిపోయింది.. లేపి వేస్ట్ అని చెప్పినట్లు సదరు బాలిక చెప్పింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు యువత ఎటువెళ్తుందనే సందేహాలు నెలకొన్నాయి.