అక్షరటుడే, వెబ్డెస్క్:India- Pak | జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అణ్వస్త్రాలు కలిగిన రెండు పొరుగు దేశాలు ఇప్పటికే ప్రతీకార చర్యలతో యుద్ధం అంచున నిలిచాయి. 26 మందిని బలిగొన్న విషాద ఘటన తర్వాత పాకిస్తాన్(Pakistan)పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు రక్షణ దళాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం నేరుగా యుద్ధం ప్రారంభం కాకపోయినప్పటికీ, రెండు దేశాల మధ్య సైబర్ వార్(Cyber War) మొదలైంది.
India- Pak | రంగంలోకి దిగిన హ్యాకర్లు
రెండు దేశాలకు చెందిన హ్యాకర్లు(Hackers) ప్రత్యర్థులను చిత్తు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే మన దేశానికి చెందిన కొందరు పాకిస్తాన్కు ట్రయిలర్ చూపించినట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన డేటాబేస్(Database)లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. యూరో ఆయిల్, AJK సుప్రీంకోర్టు, బలూచిస్తాన్ విశ్వవిద్యాలయం, వాడా కాల్ ఏజెన్సీ సింధ్ పోలీసులకు చెందిన డేటాబేస్లలోకి చొచ్చుకెళ్లి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని తెలుస్తోంది. మరోవైపు, పాకిస్తాన్కు చెందిన కొందరు.. ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్సైట్ను హ్యాక్ చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్(Army Chief Asim Munir) చేసిన ఇటీవలి వ్యాఖ్యల మాదిరిగానే మతపరమైన తేడాలను హైలైట్ చేస్తూ, రెండు దేశీయ సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తూ రెచ్చగొట్టే సందేశాన్ని ఉంచారు.
India- Pak | ఆధిపత్యం కోసం..
ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు సైబర్ దాడులు(Cyber Attacks) ఆందోళనకరంగా మారాయి. సైబర్ దాడులు ఇప్పుడు భౌగోళిక రాజకీయ వ్యూహాలకు కేంద్రంగా మారాయని, ఇవి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతీయ ప్రభుత్వ వెబ్సైట్(Indian Government Website)లను అనుకరించే ఫిషింగ్ డొమైన్(Phishing Domain)లతో హానికరమైన పీడీఎఫ్ ఫైల్స్ను కొందరు ఆన్లైన్లో వైరల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ నుంచి ఉద్భవించిన అనేక దాడులను తాము విజయవంతంగా అడ్డుకున్నామని భారత అధికారులు వెల్లడించారు. ఈ సైబర్ దాడులకు పాక్ ప్రభుత్వ మద్దతు ఉందని చెబుతున్నారు.