అక్షరటుడే, వెబ్డెస్క్: Covid | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. దేశ, విదేశాలను గడగడలాడించడమే కాదు, పూర్తిగా లాక్డౌన్ చేసి పారేసిన కోవిడ్-19 మళ్లీ పడగ విప్పుతోంది. ప్రధానంగా ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలలో కొత్త వేవ్ వ్యాపిస్తోంది. హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ తదితర దేశాల్లో ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా సింగపూర్లో గత సంవత్సరంలో 28 శాతం కేసుల పెరుగుదల నమోదైంది. మే 3 నాటికి 14,200 కేసులు నమోదయ్యాయంటే కోవిడ్-19 వ్యాప్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క సింగపూర్లోనే కాదు, చైనాలోనూ గరిష్టంగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే, థాయిలాండ్లో ఏప్రిల్లో జరిగిన సాంగ్క్రాన్ పండుగ తర్వాత కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు.
Covid | ఆయా దేశాల్లో పెరుగుదల
హాంకాంగ్లో COVID-19 కొత్త వేవ్ విస్తరిస్తోందని అక్కడి అధికారులు నిర్ధారించారు. శ్వాసకోశ నమూనాలను పాజిటివ్గా పరీక్షించే శాతం మార్చిలో 1.7% నుండి 11.4%కి పెరిగింది. ఇది ఆగస్టు 2024 గరిష్ట స్థాయి కంటే కూడా ఎక్కువ. ఇప్పటికే ఇక్కడ 30 మంది కరోనాతో మరణించారు. సింగపూర్(Singapore)లో మే ప్రారంభంలో COVID కేసులు 28% పెరిగాయి. రోజువారీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య దాదాపు 30% పెరిగింది. చైనాలో COVID కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, గత వేసవి వేవ్లో చూసిన గరిష్ట స్థాయిలకు దగ్గరగా ఉన్నాయి. ఇటీవలి వారాల్లో టెస్టింగ్ పాజిటివిటీ రేట్లు రెట్టింపయ్యాయని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. థాయిలాండ్లో ఏప్రిల్లో సాంగ్క్రాన్ పండుగ తర్వాత కేసులు పెరిగాయి.
Covid | ఆయా దేశాలకు వెళ్లకపోవడమే మంచిది..
ప్రస్తుతం COVID-19 కేసులు పెరుగుతున్న దేశాలకు వెళ్లకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితంగా వెళ్లానుకుంటే వైరస్ వ్యాప్తి తీవ్రత, మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, ఏవైనా స్థానిక ప్రయాణ పరిమితులు వంటి పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. అత్యవసరం కాకపోతే ప్రయాణం వాయిదా వేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. కచ్చితంగా వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించడం, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం వంటివి చేయాలని చెబుతున్నారు. తరచుగా చేతులను కడుక్కోవడం, ముందుగానే బూస్టర్ షాట్(Booster Shot) తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుత వైరస్ పెద్దగా హానికారకం కాదని, భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు. అయితే, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా అనారోగ్యంతో బాధ పడుతున్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.