అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారు. తమ లాభాల కోసం కలుషిత నీరు సరఫరా చేసి విద్యార్థుల ఆరోగ్యాలను పాడు చేస్తున్నారు. తాగడానికి ఏ మాత్రం పనికి రాని నీటిని హాస్టళ్లు (Hostels), కాలేజీలకు సరఫరా చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్(Madhapur)లో గల సున్నం చెరువు (sunnam cheruvu) సమీపంలో కొందరు వ్యాపారులు బోర్లు వేశారు. బోర్ల ద్వారా ట్యాంకర్లలో నీటిని నింపి మాదాపూర్లోని హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. సున్నం చెరువు కలుషితమై.. దగ్గరకు వెళ్తే భరించలేని వాసన వస్తుంది. అటువంటి చెరువు దగ్గర బోర్లు వేసి ఆ నీటిని విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. మాదాపూర్ పరిసరాల్లోని విద్యా సంస్థలు, వసతి గృహాలు, హోటళ్లకు ఆ నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండడం గమనార్హం.
Hyderabad | పీసీబీ పరీక్షల్లో విస్తుపోయే విషయాలు
సున్నం చెరువును పునరుద్ధరించాలని హైడ్రా (Hydraa) సంకల్పించింది. ఈ క్రమంలో ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) ద్వారా పరీక్షించింది. తాగునీటిగా సరఫరా చేస్తున్న ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేయించింది. ఈ పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. సున్నం చెరువు సమీపంలోని భూగర్భ జలాల్లో సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు అధికంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ (PCB) హెచ్చరించింది.
Hyderabad | కాచినా పోని కాలుష్యం
సాధారణంగా తాగునీటి కాచి వడబోసి తాగాలని సూచిస్తారు. అయితే మాదాపూర్లో కొందరు వ్యాపారులు సరఫరా చేస్తున్న నీటిని మరగబెట్టిన ప్రయోజనం లేదని అధికారులు పేర్కొంటున్నారు. సీసం, కాడ్మియం, నికెల్ వంటి భార లోహాలు కరగకపోగా.. మరింత దగ్గరగా మారి ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. సున్నం చెరువు వద్దే కాకుండా నగరంలోని కాలుష్య సాగరాలు, మురుగు కాల్వల చెంత ఉన్న నివాస ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఇదే పరిస్థితి ఉందని పీసీబీ పరిశోధనల ద్వారా తేల్చింది. అయితే ఈ హానికర నీటిని తాగునీటిగా సరఫరా చేస్తుండటడంతో హైడ్రా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad | సున్నం చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు
హైడ్రా సున్నం చెరువు పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. నగరంలో చేపడుతున్న 6 చెరువుల పునరుద్ధరణలో సున్నం చెరువు ఉంది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య సున్నం చెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును కాలుష్యం నుంచి కాపాడి.. మంచి నీరు నిలిచేలా దాదాపు రూ.10కోట్లతో హైడ్రా అభివృద్ధి చేస్తోంది.