అక్షరటుడే, న్యూఢిల్లీ:Congress | దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ప్రజల్లో పలుచన అవుతోంది. మతి తప్పిన మాటలు, తిక్క వ్యాఖ్యలతో విమర్శల పాలవుతోంది. ఎన్నికలప్పుడే కాదు.. జాతి భద్రతకు సంబంధించిన అంశాల్లోనూ హస్తం పార్టీ నేతలు(Hastam Party Leaders) చేస్తున్న వాదన ఎదురు తంతోంది. ఎప్పుడేం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కనీస స్పృహ మరిచిపోయిన కాంగ్రెస్ నాయకులపై విమర్శల జడివాన కురుస్తోంది.
పహల్గామ్(Pahalgam) ఉదంతం తర్వాత కొందరు సీనియర్లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సహా మిగతా నేతలు స్పందించిన తీరు బీజేపీ(BJP)కి చేజేతులా అస్త్రాలను అందించాయి. అంతా అయిపోయాక, ప్రజల్లో చులకన అయ్యాక పార్టీ నాయకత్వం తీరిగ్గా స్పందించింది. పహల్గామ్ విషయంలో ఎవ్వరేం మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజా ఉదంతం కాంగ్రెస్ సమర్థవంతమైన నాయకత్వ లేమిని ఎత్తి చూపింది.
Congress | మసక బారుతున్న ప్రతిష్ఠ
దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్(Congress) క్రమంగా ప్రజలకు దూరమైంది. కోటరిలో చిక్కుకున్న అగ్ర నాయకత్వం, కొరవడిన దిశానిర్దేశం వెరసి హస్తం పార్టీ వేగంగా కనుమరగయ్యే స్థితికి దిగజారింది. కాంగ్రెస్కు ఆటుపోట్లు కొత్తేమీ కాదు. పడిపోయిన చోటే నిలబడిన చరిత్ర దాని సొంతం. కానీ కొన్నేళ్లుగా ఆ పార్టీ దిగజారిపోవడమే తప్ప లేచి నిలబడింది లేదు. ఒకవైపు కాషాయ దళం ఎత్తులకు నిలబడలేక, మరోవైపు, పార్టీని సరైన దిశలో నడిపించలేక మరింత అథ:పాతాళానికి కూరుకుపోయింది.
ప్రధానంగా రాహుల్గాంధీ(Rahul Gandhi) శకం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ ప్రభ పూర్తిగా మసక బారింది. ప్రధాని మోదీ(Prime Minister Modi), హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) ఎత్తుల ముందు రాహుల్ నాయకత్వం ఎందుకూ కొరగాకుండా పోయింది. యాభై ఏళ్ల నవ యువకుడు రాహుల్గాంధీ.. రాజకీయాల్లో రాటు దేలడం లేదు. ప్రజల నాడిని పసిగట్టడంలో, ఎన్నికల ప్రణాళికలు రూపొందించడంలో, పార్టీకి పూర్వవైభవం తేవడంలోనూ ఆయన విఫలమయ్యారు. తనకు తగినట్లే ఆయన పార్టీ నేతలు సైతం తయారయ్యారు. ఏం మాట్లాడాలో, ఎప్పుడెలా మాట్లాడాలో కూడా తెలియక కాంగ్రెస్ పుట్టి ముంచుతున్నారు.
Congress | చిల్లర వ్యాఖ్యలు..
పహల్గామ్ మారణ కాండ దేశాన్ని కదిలించింది. ప్రతి భారతీయుడి హృదయాన్ని రగలించింది. పాకిస్తాన్(Pakistan)పై కఠిన చర్యలకు ముక్తకంఠంతో నినదిస్తోంది. ఇలాంటి తరుణంలో కేంద్రానికి అండగా ఉండాల్సిన ప్రధాన ప్రతిపక్షం.. అనుసరిస్తున్న వైఖరి విమర్శల పాలవుతోంది. కాంగ్రెస్ నేతలు(Congress Leaders) చేస్తున్న పాక్ అనుకూల వ్యాఖ్యలు ప్రజల్లో అసహనం రేకెత్తిస్తున్నాయి.
ఉగ్రదాడి(Terrorist Attack) జరిగిన అనంతరం ప్రియాంకగాంధీ భర్త రాబార్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah) సైతం అదే తరహాలో పాక్కు మద్దతుగా మాట్లాడటం విస్మయానికి గురిచేసింది. పహల్గామ్లో కేవలం హిందువులను టార్గెట్గా చేసి చంపేస్తే, అదే విషయాన్ని బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటే దానికి కూడా వక్రభాష్యం చెప్పిన ఘనత కాంగ్రెస్ నాయకులు సొంతం.
ఉగ్రవాదులు(Terrorists) ప్రజలను చంపే ముందు వారి మతం గురించి అడగలేదని కాంగ్రెస్కు చెందిన కర్ణాటక మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ వ్యాఖ్యానించారు. పైగా ఉగ్రదాడి బాధితురాలు మతి లేకుండా తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక, మరో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సైఫుద్దీన్ సోజ్(Former Union Minister Saifuddin Soz) కూడా ఇలాగే మాట్లాడారు. ఉగ్రదాడితో సంబంధం లేదని పాకిస్తాన్ చెబుతుంటే సింధు జలాలను కేంద్రం ఆపేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఇలా కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా పాక్కు అనుకూలంగా గొంతెత్తుతుండటం చూసి జనం ఛీత్కరించుకుంటున్నారు. బీజేపీ(BJP) దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది. పాకిస్తాన్ నేతలు అంటూ వ్యంగ్యంగా వెక్కిరించింది. దీంతో కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలకు దిగింది. అంతా అయిపోయాక, జరగాల్సిన నష్టం జరిగి పోయాక నిద్రలేచిన అధిష్ఠానం.. ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించడం వైచిత్రి కాక మరేమిటి?
Congress | వేగంగా పతనం దిశగా..
ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నా, జనం ఛీత్కరించుకుంటున్నా ఆ పార్టీలో కించిత్ మార్పు లేదు. ప్రజలెందుకు దూరం పెడుతున్నారోనన్న ఆలోచన కూడా చేయడం లేదు. కోటరి దాటి బయటకు రాని అధినాయకత్వం.. ప్రజల మూడ్ను పసిగట్టడంలో వైఫల్యం.. వెరసి కాంగ్రెస్ పతనం(Congress Fall) దిశగా అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. పార్టీని కాపాడుకోవాలన్న కనీస ఆలోచన కూడా నాయకత్వానికి లేకుండా పోయింది.
పార్టీకి జవసత్వాలు కల్పించే సమీక్షల్లేవు.. పార్టీని విస్తరించే ప్రణాళికల్లేవు.. దూరమైన జనాలకు దగ్గరయ్యే ఆలోచనల్లేవు.. మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొనే దిశగా అడుగుల్లేవు. ఇప్పటికైనా కాంగ్రెస్ మేల్కొనకపోతే కష్టమే. గ్రాండ్ ఓల్డ్ పార్టీ(Grand Old Party) చరిత్ర పుటలకే తప్ప ఉనికి లేకుండా పోవడం ఖాయమే.