అక్షరటుడే, ఇందూరు: Dinesh kulachari | కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ (Indira Gandhi) ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయిందన్నారు. అందుకే బీజేపీ బ్లాక్డేగా పాటిస్తుందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ 21 నెలలు చీకటి రోజుల పరిపాలన చేసిందన్నారు.
Dinesh kulachari | రాజ్యాంగాన్ని అపహస్యం చేశారు..
ప్రతిపక్ష నాయకులను, కళాకారులను, పత్రికా ప్రతినిధులను ఇలా అన్ని రంగాల వారిని ఇబ్బందులకు గురి చేశారని దినేశ్ అన్నారు. కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఇందిరా గాంధీ కొడుకు సంజీవ్ గాంధీతో (Sanjeev Gandhi) పాటు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసిందని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారన్నారు. లక్షల మందిని జైల్లో వేశారన్నారు. రాజ్యాంగాన్ని కూనీ చేసిన కాంగ్రెస్ నాయకులే ప్రస్తుతం రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రైతులకు అన్యాయం చేసి ఉత్సవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ లేరని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో 27మంది మంత్రులు బలహీన వర్గాల చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేది కేవలం బీజేపీనేనని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో నియంత పరిపాలనపై పోరాటం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన జిల్లావాసులను సన్మానించారు.
Dinesh kulachari | జిల్లాకు కిషన్ రెడ్డి రాక..
ఎమర్జెన్సీ విధించి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ మూడు రోజులపాటు బ్లాక్ డేని నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు పోతన్కర్ లక్ష్మీ నారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, కొండ ఆశన్న, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.