అక్షరటుడే, హైదరాబాద్: Congress high command : సీఎం రేవంత్రెడ్డి సహా ముఖ్య నేతలను బుధవారం ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు నేడు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, టీజీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.
అధిష్ఠానం నుంచి అకస్మాత్తుగా పిలుపు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణ గురించా.. లేక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించా.. అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పలు విమానాలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఎయిర్పోర్టులు కూడా మూసి వేశారు. మరి అధిష్ఠానం పిలుపు వాయిదా వేసుకుంటుందా.. లేక కంటిన్యూ చేస్తుందా తెలియాల్సి ఉంది.
మంత్రివర్గ విస్తరణపై(కేబినెట్ విస్తరణ)పై రాష్ట్ర నేతలతో గతంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పలుమార్లు చర్చించారు. రెండు నెలల క్రితం చివరిసారిగా అందరి అభిప్రాయాలు తీసుకొని, నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి, ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు.
నేడు( బుధవారం ) సాయంత్రం నీటిపారుదల శాఖకు సంబంధించి వివిధ కార్యక్రమాల్లో సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి పాల్గొనాల్సి ఉంది. పార్టీ హైకమాండ్ పిలుపుతో వాటిని రద్దు చేశారు.
రాష్ట్ర కేబినేట్లో ఆరు ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి నలుగురికే అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. శ్రీహరి ముదిరాజ్, జి.వివేక్, పి.సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితోపాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది.
కాగా, నేటి(బుధవారం) అధిష్ఠానం పిలుపు మంత్రివర్గ విస్తరణ గురించేనా.. లేదా ఇంకేమైనా అంశమా అనేది తెలియాల్సి ఉంది.