అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | జిల్లాలో పండిస్తున్న నాణ్యమైన పంట ఉత్పత్తులను ఎగుమతి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో జరిగిన మొదటి డీఎల్ఈపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కలెక్టర్ సమీక్షించారు. మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మంచి క్వాలిటీ గల బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు పండుతున్నాయన్నారు. వీటిని సరైన రీతిలో మార్కెటింగ్, ఎక్స్ పోర్ట్ చేస్తే జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. రైతులకు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయని చెప్పారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారుల సలహాలు తీసుకొని జిల్లాలోని వ్యాపారులు, మిల్లర్లు హైదరాబాద్లోని కామర్స్ అండ్ ఎక్స్ పోర్ట్ శాఖ వారితో సంప్రదించి క్వాలిటీ గల రైస్, మొక్కజొన్నలు, సోయాబీన్ ఎక్స్ పోర్ట్ చేయాలని సూచించారు. జిల్లా నుంచి నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యేలా పరిశ్రమల శాఖ అధికారులు పర్యవేక్షించాలని జీఎండీఐసీ లాలు నాయక్ ను ఆదేశించారు.
జిల్లాలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య ద్వారా ఒక రైస్ మిల్లు, ఒక పెట్రోల్ పంపును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శైలజ, ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ నాయక్, డీఆర్డీవో సురేందర్, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, ఎల్డీఎం చంద్రశేఖర్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమణ పాల్గొన్నారు.