అక్షరటుడే, వెబ్డెస్క్:MLC Kavitha | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల(Social Welfare Gurukul School)ల్లో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వీపింగ్ మరియు శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల రూ.40 వేలు కేటాయించామని ఆమె గుర్తు చేశారు. ఆ డబ్బులతో నలుగురు తాత్కాలిక ఉద్యోగులను పెట్టుకొని పారిశుధ్య పనులు చేసేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్లు ఆమె ఆరోపించారు. దీంతో పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణను శుభ్రం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
పిల్లలతో పనులు చేయించడాన్ని సమర్థిస్తూ మాట్లాడిన ఓ అధికారి ఆడియోను కవిత ఎక్స్(Kavitha X)లో పోస్ట్ చేశారు. పిల్లలను సమానంగా చూడాల్సిన అధికారులు ఇలా పనులు చేయించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థలలో అసిస్టెంట్ కేర్ టేకర్లను(Assistant Caretakers) తొలగించి వారు చేసే పనులను పిల్లలతో చేయిస్తున్నారని మండిపడ్డారు.
‘‘సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదివే పిల్లలు ఏమైనా పోష్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారా? వెళ్లి కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్ రాదు అనడం.. ఎందుకు ఇలాంటి పనులు చేయరు చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ (IAS) అనడం దుర్మార్గం” అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడం గారి పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను వారే క్లీన్ చేస్తారా అని ప్రశ్నించారు. అలా మట్లాడిన అధికారి వర్షిణిని తక్షణమే విధుల్లో నుంచి తప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. పిల్లలతో పనిచేయించటం ఆపివేయాలన్నారు.