అక్షరటుడే, వెబ్డెస్క్: Chenab bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన.. ఈఫిల్ టవర్(Eiffel Tower) కంటే 30 అడుగుల ఎత్తున నిర్మించిన వారధిగా చీనాబ్ వంతెన చరిత్ర సృష్టించనుంది.
జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో గల బక్కల్, కౌరి మధ్య దాదాపు రూ.1,400 కోట్ల వ్యయంతో నిర్మించిన చీనాబ్ వంతెన నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెనగా పిలువబడే చీనాబ్ రైలు బ్రిడ్జి (Chenab Rail Bridge) 272 కి.మీ. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (Udhampur-Srinagar-Baramulla Rail Link – USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. దీన్ని భారతదేశానికి గేమ్ చేంజర్గా అభివర్ణిస్తారు.
పారిస్(Paris)లోని ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు, కుతుబ్ మినార్ కంటే దాదాపు ఐదు రెట్లు ఎత్తున నిర్మించిన ఈ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుక్రవారం ప్రారంభించనున్నారు. శ్రీనగర్, కత్రా మధ్య ప్రత్యేకంగా రూపొందించిన రెండు వందే భారత్ రైళ్లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. చీనాబ్ వంతెనతో పాటు భారతదేశంలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన అయిన అంజి వంతెనను కూడా ప్రధాని ప్రారంభిస్తారు
Chenab bridge : ఇంజినీరింగ్ నైపుణ్యం..
చీనాబ్ వంతెన ఇంజినీరింగ్ అద్భుతానికి ప్రతీకగా నిలుస్తుంది. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ 1,315 మీటర్ల పొడవైన ఉక్కు ఆర్చ్ నిర్మాణం తీవ్ర భూకంపాలను తట్టుకుంటుంది. అలాగే అధిక గాలి వేగాన్ని సైతం తట్టుకునేలా దీన్ని రూపొందించారు. ఇది అందుబాటులోకి వస్తే కాట్రా – శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సుమారు 3 గంటల సమయం ఆదా అవుతుంది. భారతీయ రైల్వేలు, జాతీయ సమైక్యతకు చీనాబ్ బ్రిడ్జి నిదర్శనంగా నిలువబోతున్నది. ఇది భారత రైల్వే నెట్వర్క్ ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరిస్తుంది.
ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైలు లింక్ (USBRL) ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రైలు మౌలిక సదుపాయాలలో భాగం. చీనాబ్ వంతెన సలాల్ ఆనకట్ట సమీపంలో చీనాబ్ నదిపై 1,315 మీటర్లు విస్తరించి ఉంది. నదీగర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ వంతెన ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఢిల్లీ(Delhi)లోని కుతుబ్ మినార్(Qutub Minar) కంటే నదీగర్భం నుండి రైలు స్థాయి వరకు దాదాపు ఐదు రెట్లు ఎత్తుగా ఉంది. ఇది రైల్వే వంతెన ఇంజనీరింగ్లో ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పింది. గంటకు 266 కి.మీ మేర గాలి వీచినా తట్టుకునేలా 28,000 మెట్రిక్ టన్నులకు పైగా ఉక్కుతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. భారతీయ రైల్వేల(Indian Railways)లో మాడ్రన్ కేబుల్ క్రేన్ వ్యవస్థ(modern cable crane system)ను కలిగి ఉన్న వంతెన ఇదే మొదటిది.