అక్షరటుడే, వెబ్డెస్క్: PM Dhan-Dhanya Krishi Yojana | వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ, అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు గాను ‘ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన'(PM Dhan-Dhanya Krishi Yojana)ను ప్రారంభించనుంది.
ఏటా రూ.24 వేల కోట్లతో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పెంచడం, పంటకోత తర్వాత నిల్వను పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను సులభతరం చేయడం వంటివి ఈ పథకం కింద లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
వ్యవసాయ జిల్లా ప్రణాళికకు సంవత్సరానికి రూ.24,000 కోట్ల వ్యయం, పునరుత్పాదక శక్తిలో ప్రధాన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహంలో భాగంగా, భారతదేశం అంతటా తమ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను విస్తరించడానికి NTPC ద్వారా రూ.20,000 కోట్లు, NLC ఇండియా ద్వారా రూ.7,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
PM Dhan-Dhanya Krishi Yojana | గ్రీన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం..
దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల (Green Energy Project) విస్తరణను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణకు భారీగా నిధులు కేటాయించడానికి అనుమతించింది. NTPC, దాని పునరుత్పాదక విభాగం NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) ప్రాజెక్ట్ ఆమోద అధికారాలను కేంద్ర మంత్రివర్గం(Union Cabinet) పెంచింది.
NLC ఇండియా లిమిటెడ్ బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ. ఈ పెట్టుబడి దాని అనుబంధ సంస్థ NLC ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్ (NIRL) పునరుత్పాదక ఇంధన ప్రణాళికలకు మద్దతు ఇస్తుంది. 2030 నాటికి 10 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే NLCIL లక్ష్యంలో భాగంగా NIRL గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ నిధులు సహాయపడతాయి.
కేంద్ర తాజా నిర్ణయం దేశ విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, వేగవంతమైన పెట్టుబడులను ఆకర్షించడానికి, నమ్మకమైన, 24 గంటల విద్యుత్తును అందించే లక్ష్యాన్ని సాధించడానికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ఇది స్థానిక ఉపాధిని కూడా సృష్టిస్తుంది, MSMEలను పెంచుతుంది. నిర్మాణం, కార్యకలాపాల సమయంలో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది.
PM Dhan-Dhanya Krishi Yojana | శుక్లాకు సత్కారం..
భారత వ్యోమగామికి శుభాన్షు శుక్లా(Shubhaanshu Shukla)ను కేంద్ర మంత్రిమండలి అభినందిస్తూ తీర్మానం చేసింది. శుక్లా ఇటీవలి రోదసిలోకి వెళ్లి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు వివిధ ప్రయోగాలు చేసి సురక్షితంగా తిరిగి వచ్చిన శుక్లాకు కేంద్రం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) ఈ విషయాన్ని వెల్లడించారు. “(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విజయవంతంగా వివిధ ప్రయోగాలు చేసి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ఇది దేశం గర్వించే పరిణామం.. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా భూమికి విజయవంతంగా తిరిగి వచ్చినందుకు దేశంతో పాటు మంత్రివర్గం ఆయనకు అభినందనలు తెలియజేస్తోంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(International Space Station)లో ఆయన 18 రోజుల చారిత్రాత్మక మిషన్ను పూర్తి చేశారు. ఇది భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో ఒక కొత్త అధ్యాయం. ఇది మన అంతరిక్ష కార్యక్రమం భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేస్తుంది. ఈ చారిత్రాత్మక విజయం కోసం ఇస్రోలోని శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందాన్ని మంత్రివర్గం అభినందిస్తుంది..” అని అన్నారు.