అక్షరటుడే, వెబ్డెస్క్ : Census | కేంద్ర ప్రభుత్వం(Central Government) ఎట్టకేలకు జనగణనపై గెజిట్ విడుదల చేసింది. 2027 మార్చి 31 వరకు భారతదేశ జనాభా గణనను పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎన్నో సార్లు వాయిదా పడుతూ వస్తున్న జనగణన(Census)పై సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలో 2011లో ఆఖరు సారి జనగణన చేపట్టారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కించాలి. కానీ 2021లో కరోనా(Corona) కారణంగా జనాభా లెక్కలను వాయిదా వేశారు. అయితే అనంతరం పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్(Gazette notification) విడుదలైంది.
Census | 16వ జన గణన
దేశంలో రెండు దశల్లో జనగణన చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ మొత్తంగా 16వది కాగా, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జనగణన. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్(Jammu and Kashmir), లద్దాఖ్(Ladakh), ఉత్తరాఖండ్(Uttarakhand), హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి జనగణన పూర్తి చేస్తారు. మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణనను చేపట్టనున్నారు.
జన గణనపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. జనాభా లెక్కల కోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. డిజిటల్ రూపంలోనే ట్యాబ్ల ద్వారా జనాభా లెక్కల వివరాలను సిబ్బంది సేకరించనున్నారు.