అక్షరటుడే, వెబ్డెస్క్:Caste Census | మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం(Central Government) అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది.
జనగణనతో పాటు కులగణన చేపట్టనున్నట్టు ప్రకటించింది. మోదీ(Modi) నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని అన్ని రాజకీయ పక్షాలు స్వాగతించాయి. అలాగే, రిజర్వేషన్ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని అనేక మంది కుల సంఘాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు కుల గణన(Caste Census) అంటే ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చదవండి.
Caste Census | కుల గణన అంటే..?
దేశంలో ఉన్న కులాలు, ఉప కులాలను తేల్చడం, అలాగే, ఆయా కులాల వారీగా ఉన్న జనాభాను లెక్కించడమే కుల గణన(Caste Census). దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కులాల సామాజిక-ఆర్థిక పరిస్థితులు, విద్య సంబంధిత అంశాలను సేకరిస్తారు. ఆయా కులాల జనాభా, స్థితిగతులను సేకరించి నివేదిక రూపొందిస్తారు. సాధారణ పౌరుల డేటాతో పాటు కుల సమాచారాన్ని కూడా సేకరిస్తారు. వివిధ కులాల సామాజిక-ఆర్థిక స్థితి, ప్రాతినిధ్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ప్రధానంగా రిజర్వేషన్లకు(Reservations), సంక్షేమ పథకాలకు ఈ కుల గణన ఆధారంగా మారుతుంది. ఏయే కులాలు అట్టడుగున ఉన్నాయో గుర్తించి, వారి జీవన ప్రమాణ స్థాయి మెరుగుదలకు ప్రత్యేక చర్యలు, పథకాలు అమలు చేసేందుకు ఉపయోగపడుతుంది.
Caste Census | నాలుగు వర్గాలు..
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వం (Government) సామాజిక, విద్యా ప్రమాణాల ఆధారంగా పౌరులను నాలుగు విస్తృత సమూహాలుగా వర్గీకరించింది. అందులో షెడ్యూల్డ్ తెగలు (ST), షెడ్యూల్డ్ కులాలు (SC), ఇతర వెనుకబడిన తరగతులు (OBC), ఇతరులు. సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది.
Caste Census | ఇదే తొలిసారి..
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా జన గణన నిర్వహించినప్పటికీ, కుల గణన నిర్వహించలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రతీ పదేళ్లకోసారి దేశంలో జన గణన జరిగింది. 1951 నుంచి 2011 వరకు భారతదేశం(India)లో జరిగిన ప్రతి జనాభా గణన షెడ్యూల్డ్ కులాలు (SCలు), షెడ్యూల్డ్ తెగలు (STలు) డేటాను మాత్రమే సేకరించారు.
కానీ మిగతా ఓబీసీ, ఇతరుల వారి వివరాలను సేకరించలేదు. అయితే, గతంలో అంటే బ్రిటిష్(British) పాలనలో 1931కి ముందు జన గణనతో పాటు కుల గణన కూడా నిర్వహించే వారు. మన దేశంలో చివరి సమగ్ర కుల గణన 1931 లో జరిగింది. ఆ తరువాత, స్వతంత్ర భారతదేశంలో పదేళ్లకోసారి జన గణన జరిగినా, కుల గణన మాత్రం జరుగలేదు. ఈ కుల గణన కేవలం ఎస్సీ, ఎస్టీ వర్గాలకే పరిమితమైంది.
Caste Census | బయటకు రాని నివేదిక
2011లో ప్రభుత్వం(Government) విస్తృత కుల డేటాను సేకరించే లక్ష్యంతో సామాజిక-ఆర్థిక, కుల గణన (SECC) ను చేపట్టింది. అయితే, డేటా ఖచ్చితత్వంపై సందేహాల నేపథ్యంలో ఆ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదు.
Caste Census | జన, కుల గణన ఎప్పుడో?
వాస్తవానికి 2021లోనే జన గణన నిర్వహించాలి. అయితే, ఆ సమయంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా(Corona) మహమ్మారి వ్యాప్తి కారణంగా కేంద్రం ఆ ప్రక్రియను చేపట్టలేదు. లాక్డౌన్(Lockdown), ఇతర ఆంక్షల కారణంగా వాయిదా వేసింది. కరోనా వైరస్(Corona Virus) భయం తొలగిపోయాక కూడా కేంద్రం సెన్సస్కు ముందుకు రాలేదు. కాంగ్రెస్(Congress) సహా ఇతర పార్టీలు జన గణనకు ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం స్పందించలేదు. అయితే, ఆకస్మాత్తుగా జనగణనతో పాటు కుల గణన చేపట్టాలన్న చారిత్రక నిర్ణయం తీసుకుంది. కానీ, ఈ గణన ఎప్పుడు చేపడతారనే మాత్రం ప్రకటించలేదు. దీనిపైనే అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.