అక్షరటుడే, వెబ్డెస్క్: HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) వ్యవహారం బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోంది. జగన్మోహన్ రావు (Jagan Mohan Rao) అడ్డదారిలో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదే విషయాన్ని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి (Telangana Cricket Association Secretary Guruvareddy) వెల్లడించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, జగన్మోహన్ రావు సహా ఐదుగురిని అరెస్టు చేసిన సీఐడీ డొంక కదిలించేందుకు దర్యాప్తు చేపట్టింది. మరోవైపు, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా హెచ్సీఏ వ్యవహారంలోకి ఎంటరైంది. కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీని కోరింది.
HCA | కవిత హస్తం..
జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అక్రమ పద్ధతుల్లో ఎన్నికయ్యాడని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యద్శి గురువారెడ్డి ఆరోపించారు. హెచ్సీఏ అవకతవకల వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) హస్తముందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రావుకు, కవితకు దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలిపారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా కావడానికి కవిత సహకరించారని వెల్లడించారు. దీనిపై సీఐడీ, ఈడీ దృష్టి సారించాలని కోరారు. రాజకీయాలతో క్రికెట్ అసోసియేషన్ను భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మరోసారి ఇలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ట దిగజారకుండా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని విన్నవించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సిటీ వరకే పరిమితమైందన్నారు. హెచ్సీఏలో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఐపీఎల్ (IPL) నిర్వహణ కోసం బీసీసీఐ ప్రతి సంవత్సరం హెచ్సీఏకు రూ.100 కోట్ల వరకు ఇస్తుందని ఆయన వెల్లడించారు. దాదాపు ఇప్పటి వరకు రూ.170 కోట్లు గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు. విజిలెన్స్ వారు విచారణ చేయడం.. తర్వాత సీఐడీ ఎంటర్ అవ్వడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లు సృష్టించడం అంతా బయటపడిందని గురువారెడ్డి అన్నారు. ఎలక్షన్ కమిషన్ సంపత్ కుమార్ (Election Commission Sampath Kumar) ఎలా ఇతనిని పోటీ చేయించారని ప్రశ్నించారు. జగన్మోహన్ రావు అనర్హుడని వ్యాఖ్యలు చేశారు. క్లబ్లో ఉన్నవారు ఎందుకు సహకరించారని నిలదీశారు. బీసీసీఐ (BCCI) ఇచ్చే గ్రాంట్ను గ్రౌండ్ల అభివృద్ధికి, క్రీడాకారులకు ఉపయోగించాలని.. కానీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జస్టిస్ నాగేశ్వర రావు (Justice Nageswara Rao) చెప్పిన వివరాల ప్రకారం అంతకు ముందు నేర చరిత్ర ఉన్నవాళ్లను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. ఏ క్లబ్ కూడా సొంతంగా నడపట్లేదని స్పష్టం చేశారు.
‘క్లబ్లలో ఉన్న 217 మంది సభ్యులు అందరూ దొంగలే. పబ్లిక్కు సంబంధించిన కోట్ల రూపాయలు ఎలా వాడుకున్నారు. దీని వెనక రాజకీయ నాయకులు ఎవరున్నా అన్నీ బయట పెడతాను. క్యాంటీన్ను కూడా ఎవరికి ఇచ్చారు? ఎంత నిధులు తిన్నారు అనే వివరాలు అన్నీ ఉన్నాయి. చాలా మంది దొంగలు ఇందులో ఉన్నారు. జగన్మోహన్ నీకు క్రికెట్ అంటే తెలుసా? ఎందుకు ఎలా ఎన్నికయ్యావు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రికెటర్లకు గత పది సంవత్సరాలుగా గుర్తింపు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో క్రికెట్కు గుర్తింపు వచ్చే వరకు పోరాడతామని గురువా రెడ్డి స్పష్టం చేశారు.
HCA | సీఐడీ దూకుడు.. ఈడీ ఎంట్రీ..
మరోవైపు, హెచ్సీఏ వ్యవహారంలో సీఐడీ దూకుడు పెంచింది. జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ కావడానికి అడ్డదారులు తొక్కినట్లు సీఐడీ గుర్తించింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడైన బీజీపీ నాయకుడు సి.కృష్ణ యాదవ్ (BJP leader C.Krishna Yadav) సంతకాలను ఫోర్జరీ చేసి… శ్రీచక్ర క్రికెట్ క్లబ్నే గౌలిపుర క్రికెట్ క్లబ్గా నమ్మించి, హెచ్సీఏలోకి ప్రవేశించినట్లు తేల్చింది. ఈ క్రమంలోనే కీలక ఆధారాలు సేకరించడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే జగన్మోహన్ రావు సహా ఐదుగురిని అరెస్టు చేసిన సీఐడీ.. వారిని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. కీలక ఆధారాలు సేకరించడంపై దృష్టి సారించింది. మరోవైపు, హెచ్ సీఏ అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సీడీఐని కోరింది.