అక్షరటుడే, వెబ్డెస్క్ : Bonalu Festival | హైదరాబాద్ (Hyderabad) నగరంలో బోనాల సందడి మొదలైంది. ఆషాఢ మాసంలో భాగ్యనగరంలో అమ్మవార్లకు ఏటా అంగరంగ వైభవంగా బోనాలు (Bonalu) సమర్పిస్తారు. గోల్కొండ కోట (Golkonda Fort)లో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో మహానగరంలో బోనాలు ప్రారంభం అయ్యాయి.
ఈ నెల 26న గురువారం ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా గోల్కొండ కోటలోని అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. పలువురు ప్రముఖుల సైతం హాజరై బోనం మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఆదివారం సందర్భంగా నేడు కూడా భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. దీంతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పోతరాజుల విన్యాసాలు, బోనాల ఊరేగింపుతో కళకళలాడింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల పండుగతో మహా నగరంలో నెల రోజులపాటు ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. జూన్ 26న ప్రారంభమైన బోనాలు జూలై 24 వరకు కొనసాగనున్నాయి. సికింద్రాబాద్, లాల్ దర్వాజా, ధూల్పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అంతేగాకుండా నగరంలోని పలు ఆలయాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకుంటారు. దీంతో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.