అక్షరటుడే, వెబ్డెస్క్:Ahmedabad Plane Crash | విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదానికి గురైనప్పుడు బ్లాక్ బాక్స్(Black box) పేరు వింటుంటాం. విమానం ప్రమాదానికి సంబంధించిన సమాచారం బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ డేటాను విశ్లేషించి అధికారులు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటారు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad plane crash)లో బ్లాక్బాక్స్ డ్యామేజీ అయినట్లు సమాచారం.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి వారం రోజులు అవుతోంది. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో అధికారులు బ్లాక్ బాక్స్ (డిజిటల్ డేటా రికార్డర్) స్వాధీనం చేసుకున్నారు. అయితే అది డ్యామేజీ అయినట్లు తెలిసింది. దీంతో డేటా విశ్లేషణ కోసం దానిని అమెరికా పంపాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Ahmedabad Plane Crash | బ్లాక్ బాక్స్లో రెండు పరికరాలు
విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్లో రెండు పరికరాలు ఉంటాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్) ఉంటాయి. పైలెట్ మాట్లాడిన వివరాలు సీవీఆర్లో రికార్డు అవుతాయి. ఎఫ్డీఆర్ విమాన గమనం, ఇతర సాంకేతిక అంశాలు నిక్షిప్తం అవుతాయి. అయితే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) నుంచి స్వాధీనం చేసుకున్న ‘బ్లాక్ బాక్స్’ దెబ్బతినడంతో దానిని వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అక్కడ డేటాను విశ్లేషించనున్నట్లు తెలిసింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
Ahmedabad Plane Crash | తీరని విషాదం
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171 జూన్ 12న టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృతి చెందారు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel) భవనంపై కూలడంతో అందులో ఉన్న వారు సైతం చనిపోయారు. మొత్తం 270 మంది విమాన ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.