అక్షరటుడే, వెబ్ డెస్క్:MLA Raja Singh | బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ప్రతీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని, దీని వల్ల బీజేపీ(BJP) తీవ్రంగా నష్టపోయిందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనుకుంటున్నానని తెలిపారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్లు (బీజేపీ) కూడా ఎప్పుడో బీజేపీని బీఆర్ఎస్లో కలిపేసేవారంటూ గురువారం ఓ లేఖ విడుదల చేయడం కలకలం రేపింది. ఇప్పటికే కవిత ఎపిసోడ్తో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడగా, రాజాసింగ్(MLA Rajasingh) చేసిన వ్యాఖ్యలు మరింత కాక పుట్టిస్తున్నాయి.
MLA Raja Singh | అభ్యర్థులను డిసైడ్ చేసేది బీఆర్ఎస్సే..
బీజేపీ(BJP)లో బీఆర్ఎస్(BRS) విలీనంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు రాజాసింగ్ అన్నారు. ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలని అనుకుంటే ఎక్కడి నుంచి నిలబడాలి అనేది కూడా బీఆర్ఎస్ వాళ్లే డిసైడ్ చేస్తారన్నారు. గతంలో కూడా ఇదే జరిగిందని, అందుకే బీజేపీ నష్టపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం (BJP Government) రావాల్సి ఉందని.. కానీ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీని వల్ల బీజేపీ చాలా నష్టపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఈ విషయం తెలుసని.. అయినా ఎవరూ బయటపడరన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్తే సస్పెండ్ చేస్తారనే భయంతో కార్యకర్తలు, నాయకులు నోరు మూసుకుని కూర్చున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.