అక్షరటుడే, వెబ్డెస్క్: BJP state president | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఎన్నాళ్లుగానో కొనసాగుతోన్న ఉత్కంఠకు తెర పడింది. పార్టీ సీనియర్ నేత రాం చందర్ రావుకు (Ram Chandra Rao) అనూహ్యంగా రాష్ట్ర సారథిగా అవకాశం దక్కింది. ఎంతో మంది పోటీ పడినప్పటికీ ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగానే పూర్తయింది. అధిష్టానం (high command) ఆదేశాల మేరకు ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. సౌమ్యుడు, మృదు స్వభావి అని పేరొందిన రాంచందర్ రావుకు బీజేపీ హైకమాండ్ (BJP high command) అవకాశం కల్పించింది. హైదరాబాద్(Hyderabad)లోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఆయన.. పార్టీలో అందరితో కలుపుగోలుగా ఉంటారు. కింది స్థాయి కేడర్ నుంచి పార్టీ పెద్దల దాకా సన్నిహిత సంబంధాలు ఉండడం ఆయనకు కలిసొచ్చింది.
BJP state president | సుదీర్ఘ కాలంగా బీజేపీలోనే..
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఎన్.రాంచందర్ రావు (N.Ramchandra Rao) విద్యాభ్యాసమంతా మహా నగరంలోనే జరిగింది. కళాశాలలో ఉన్నప్పుడే ఆయన విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. రైల్వే కాలేజీలో స్టూడెంట్ యనియన్ లీడర్ గా చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోనూ యూనియన్ నాయకుడిగా పని చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చాలో (Bharatiya Janata Yuva Morcha) చేరిన ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఎంతో మంది యువకులను తీర్చిదిద్దారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్గా, జాతీయ పార్టీకి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా వ్యవహరించారు. 2008 నుంచి 2013 వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో వివిధ హోదాల్లో పని చేశారు.
BJP state president | 2015లో తొలిసారి ఎమ్మెల్సీగా..
రాంచందర్ రావు ఎమ్మెల్సీగా పలుమార్లు పోటీ చేసినప్పటికీ 2015లో ఎన్నికయ్యారు. 2009లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ, 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం (Graduate Constituency) నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి జి. దేవీప్రసాద్ రావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాదాపు ఆరేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. అంతకు ముందు 2014లో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం (Malkajgiri assembly constituency) నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు చేతిలో 73 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. 2021లో జరిగిన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవి చేతిలో ఓటమిపాలయ్యారు.
BJP state president | వివాదరహితుడిగా పేరు..
రాంచందర్ రావుకు (Ranchander Rao) వివాద రహితుడనే పేరుంది. అవసరమున్న అంశాల్లో తప్ప మిగతా వాటి గురించి ఏమాత్రం పట్టించుకోరు. అది పార్టీ విషయమైనా, ప్రత్యర్తుల విషయమైనా అనవసరంగా స్పందించరు. సౌమ్యుడిగా, అందరితో కలుపుగోలుగా ఉండే ఆయనకు.. బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. రాంచందర్ రావు వ్యక్తిత్వం, వ్యవహార శైలి ఆయనను తెలుగు రాజకీయాల్లో (Telugu politics) ప్రత్యేకంగా నిలబెడతాయి. మిగతా నాయకుల్లా గోడ దూకకుండా ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి బీజేపీ, అనుబంధ సంస్థల లోనే కొనసాగుతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు ఆర్ఎస్ఎస్(RSS)తోనూ మంచి అనుబంధం ఉందని చెబుతారు. వివాద రహితుడిగా, పార్టీకి విధేయుడిగా ఉన్నందుకే ఆయనకు రాష్ట్ర బాధ్యతలను బీజేపీ హైకమాండ్ (BJP high command) అప్పగించింది.