అక్షరటుడే, వెబ్డెస్క్ : Warangal | వరంగల్ (Warangal)లో రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మవారికి సమర్పించాల్సిన బోనాలను కూడా రాజకీయ కారణాలతో ప్రభుత్వం వాయిదా వేయడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మధ్య పోరు నడుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వరంగల్ భద్రకాళి అమ్మవారి (Bhadrakali Temple) బోనాలను వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
Warangal | గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో..
వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఈ నెల 22న బోనాలు సమర్పించాలని తొలుత నిర్ణయించారు. ఆగమ శాస్త్రం ప్రకారం అమ్మవారికి శాఖాహార బోనం సమర్పించాలని పండితులు చెప్పారని కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు శాఖాహార బోనాలు ఉంటాయని ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. అయినా కొందరు సోషల్ మీడియాలో మాంసాహార బోనాలు సమర్పిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రస్తుత రాజకీయ విభేదాల నేపథ్యంలో ఇబ్బందులు పెడతారని బోనాలు వాయిదా వేశామన్నారు. అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు.