అక్షరటుడే, ఇందూరు: Best Available Scheme | బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లో భాగంగా పిల్లలకు విద్య, వసతిని అందించిన ప్రైవేట్ యాజమాన్యాలు బకాయిల భారంతో ఇబ్బందులు పడుతున్నాయి. మూడేళ్లుగా విద్యార్థులకు అందాల్సిన నిధులు రావడం లేదు. దీంతో ఈ స్కీం అమలు చేస్తున్న పాఠశాలలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. స్కీంను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో జిల్లాలో స్కీం అమలు ప్రశ్నార్థకంగా మారింది.
Best Available School Scheme | నిజామాబాద్ జిల్లాలో..
జిల్లాలోని 8 పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం ఉంది. నిజామాబాద్లోని విజ్ఞాన్, రవి పాఠశాలలు, ఆర్మూర్లో సెయింట్ పాల్స్, భీమ్గల్లో లిటిల్ ఫ్లవర్, బోధన్లో ఇందూర్ మోడల్ స్కూల్, వంశీ, విజయ పాఠశాల, చందూర్లో విక్టరీ పాఠశాలల్లో ఈ స్కీంను అమలు చేస్తున్నారు. కానీ మూడేళ్లుగా నిధులు లేక ఒక్కొక్కరు విరమించుకుంటున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ నిరుపేద విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదివే అవకాశం కోల్పోవాల్సి వస్తోంది.
Best Available School Scheme | ఈ పథకంతో అందే సౌకర్యాలు..
బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఒకటి నుంచి 5వ తరగతి డే స్కాలర్ విద్యార్థులకు ఒకొక్కరికి రూ.28 వేలు, 5 నుంచి 10వ తరగతి హాస్టల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.42 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. ఒక్కో పాఠశాలలో 235 సీట్లు కేటాయించారు. ఈ పథకంలో ఎంపికైన హాస్టల్ విద్యార్థులైతే పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్, కాస్మోటిక్స్, మంచి భోజనం, వసతి కల్పించాల్సి ఉంటుంది.
Best Available School Scheme | మూడేళ్లుగా నిధులు రాక..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం 215 ప్రైవేట్ పాఠశాలల్లో కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 8 బడుల్లో స్కీంను అమలు చేస్తున్నారు. అయితే మూడేళ్లుగా నిధులు రాకపోవడంతో బకాయిలు పెరిగిపోతున్నాయి. కేవలం జిల్లాలోనే సుమారు 1,500 మంది విద్యార్థులకు రూ.5 కోట్లకు పైగా రావాల్సి ఉంది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఈ పథకం నిధులు లేకపోవడంతో నీరుగారే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్లో కార్పొరేట్ విద్యకు అలవాటు పడిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోలేరని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు మొరపెట్టుకుంటున్నాం
– జయసింహా గౌడ్, విజ్ఞాన్ పాఠశాల
మా పాఠశాలలో బెస్ట్ అవైలేబుల్ స్కీంను అమలు చేస్తున్నాం. మూడేళ్లుగా నిధులు రావడం లేదు. అధికారులు, నాయకులకు మా గోడును వెల్లబోసుకుంటున్నాం. అయినా నిధులు మాత్రం అందడం లేదు. విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా విద్యను అందిస్తున్నాం. ఇకనైనా ఈ పథకానికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలి.