అక్షరటుడే, వెబ్డెస్క్:Ration Rice | వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో(ration shops) మూడు నెలల రేషన్ పంపిణీ చేస్తున్నారు. అయితే ఒకేసారి బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ దుకాణాల్లో ఆలస్యం అవుతోంది. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Ration Rice | సర్వర్ సమస్య
రేషన్ దుకాణాల్లో సర్వర్ సమస్యతో బియ్యం పంపిణీ(Rice distribution) ఆలస్యం అవుతోంది. దీంతో లబ్ధిదారులు ఉదయం నుంచి రాత్రి వరకు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుండటంతో మూడు సార్లు వేలిముద్రలు పెట్టాల్సి వస్తోంది. దీంతో ఒక్కొక్కరు రేషన్ తీసుకోవడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. దీంతో దుకాణాల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
Ration Rice | అయిపోయిన బియ్యం
పలు రేషన్ దుకాణాల్లో బియ్యం అయిపోయాయి. దీంతో డీలర్లు దుకాణాలను మూసి వేశారు. కొత్తగా బియ్యం వచ్చే వరకు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో నిత్యం లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వచ్చి అడిగి వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల బియ్యం పంపిణీ కొనసాగుతున్నా.. ఆలస్యం అవుతుండటంతో భారీ సంఖ్యలో ప్రజలు వేచి ఉంటున్నారు. దుకాణాల వద్ద లైన్లో సంచులను పెట్టి బియ్యం తీసుకోవడానికి నిరీక్షిస్తున్నారు.