అక్షరటుడే, వెబ్డెస్క్: Baloch Liberation Army : భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్కు అన్ని వైపులా నుంచి కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఇండియాకు మద్దతు ప్రకటిస్తుండగా, పాక్ ఒంటరైంది. ముస్లిం దేశాలు సైతం మన వెన్నంటే నిలుస్తుండడంతో దాయాది విలవిల్లాడుతోంది. ఇలాంటి తరుణంలో అటు బలూచిస్తాన్ నుంచి వరుస దెబ్బలు తగులుతున్నాయి. బలూచిస్థాన్లో మంగళవారం జరిగిన బాంబు దాడిలో ఏడుగురు పాక్ పారామిలిటరీ సైనికులు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. వారిని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)కి చెందిన ఉగ్రవాదులు ఈ దాడి చేశారని పాక్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.
కచ్చి జిల్లా వద్ద పారామిలిటరీ దళాలు ప్రయాణిస్తున్న వాహనాలపై బాంబులతో దాడి చేశారని పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది. స్థానిక బొగ్గు గనుల్లో భద్రతా పరమైన ఆపరేషన్ నిమిత్తం వెళుతున్న దళాలను టార్గెట్ చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో గాయపడ్డ వారిని హెలికాఫ్టర్ ద్వారా మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొంది.
బలూచిస్థాన్లోని సహజవనరులను పాక్ దళాలు ఎగరేసుకుపోతున్నాయంటూ స్థానికులు ఎంతో కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పాక్ దళాల దుర్నీతిని అడ్డుకునేందుకు వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ బీఎల్ఏ నిత్యం వారిని టార్గెట్ చేసుకుంటూ ఉంటుంది. బీఎల్ఏ దాడుల్లో జనవరి నుంచి ఇప్పటివరకూ సుమారు 200 మంది పాక్ సైనికులు మరణించారు.
ఇక మార్చిలో బీఎల్ఏ జరిపిన రైలు హైజాకింగ్ ఉదంతంలో డజన్ల కొద్దీ బీఎల్ఏ వర్గాలు, పాక్ సైనికులు కన్నుమూశారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పాక్ మిలిటరీకి బలూచిస్థాన్తో పాటు ఖైబర్ పాఖ్తూన్ఖ్వా, సింధ్ ప్రావిన్స్ లలో కూడా ఎదురుగాలులు వీస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ను బూచిగా చూపించి దేశం మొత్తాన్ని మళ్లీ తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు పాక్ ఆర్మీ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.