అక్షర టుడే, ఆర్మూర్: Babli Gates | మహారాష్ట్రలోని (Maharashtra) బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మంగళవారం తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 1 నుంచి అక్టోబర్ 29 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచనున్నారు. మహారాష్ట్రలోని ప్రాజెక్టులు నిండితే వరద శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి (Sriramsagar Project) నీరు వచ్చి చేరుతుంది. అయితే పైనున్న ప్రాజెక్టుల్లో ఒకవేళ వరద అధికంగా ఉంటే అక్టోబర్ 29 తర్వాత కూడా గేట్లు ఎత్తి ఉంచుతారని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు.
Babli Gates | సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో..
బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేత ప్రక్రియలో మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వ అధికారులతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ (Central Water Commission) అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గేట్లను ఎత్తివేయాలి. కానీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆ సమయంలో వెళ్లడం కుదరదు కాబట్టి ప్రతి ఏడాది జూలై 1వ తేదీన నీటిని విడుదల చేస్తున్నారు.